రేవంత్ కు కాంగ్రెస్ హైకమాండ్ మరో బిగ్ టాస్క్..!!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం ముగియటంతో ఇక ప్రచారం పైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేసాయి. రెబల్స్ ను బుజ్జగించేందుకు ముఖ్య నేతలు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్ తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ప్రకటించింది. కాగా, తెలంగాణ సీఎం రేవంత్ కు ఆ లిస్టులో స్థానం కల్పించింది. ఇక..ఇటు బీజేపీ సైతం తమ ప్రచార వ్యూహాలకు పదును పెడుతోంది.
రేవంత్ కు బాధ్యతలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఈ సారి పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. జమిలి ఎన్నికల దిశగా అడుగులు పడుతున్న వేళ ఇక్కడ ఫలితం కీలకం కానుంది. కాంగ్రెస్ నుంచి 40 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా రంగంలోకి దించుతోంది. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేతో పాటుగా తెలంగాణ సీఎం రేవంత్ కు బాధ్యతలు కేటాయించింది. భౌగోళికంగా తెలంగాణతో మహా రాష్ట్రకు సరిహద్దు జిల్లాలు ఉన్నాయి. తెలంగాణలో అమలు చేస్తున్న గ్యారంటీలను మహారాష్ట్ర లోనూ హామీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో, తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెంచే బిగ్ టాస్క్ ను కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ కు అప్పగించింది.

బీజేపీ నేతల ప్రణాళికలు
మహాయుతి కూటమి, మహా వికాస్ అఘాడి తమ అగ్రనేతలను ప్రచారంలోకి దింపుతున్నాయి.
బీజేపీ గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి వ్యూహాలను అమలు చేస్తోంది. బీజేపీ అధినాయకత్వం రాష్ట్రంలో దాదాపు 50 బహిరంగ సభలు ఏర్పాటు చేస్తోంది. వీటిల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ప్రధాని మోదీ వెస్ట్ మహారాష్ట్ర, విదర్బ, ముంబై-కొంకణ్, నార్త్ మహారాష్ట్ర, మరాఠ్వాడాల్లో 8 పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. ఇక, మహారాష్ట్రకు చెందిన బీజేపీ ముఖ్య నేతలకు స్థానికంగా బహిరంగ సభల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివిధ జిల్లాల్లో 15 ర్యాలీల్లో పాల్గొంటారు.
ముఖ్య నేతల ప్రచారం
బీజేపీ పాలిత రాష్ట్రాల మఖ్యమంత్రులు సైతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. అమిత్షా 20 ర్యాలీలు, నితిన్ గడ్కరి 40 ర్యాలీలు నిర్వహించనుండగా, దేవేంద్ర ఫడ్నవిస్ 50 ర్యాలీల్లో పాల్గొనేలా నిర్ణయించారు. హర్యానా ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే మహారాష్ట్ర ఎన్నికల్లోనూ అనుసరించాలని బీజేపీ భావిస్తోంది. నవంబర్ 20న ఎన్నికలు జరుగనున్నాయి. జమిలి ఎన్నికల నిర్వహణ పైన మరోసారి ప్రధాని ఈ రోజు స్పష్టత ఇచ్చారు. దీంతో, మహారాష్ట్రలో గెలుపు కోసం అగ్ర నేతలు అడుగులు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications