గవర్నర్కు అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత, 'సై అని, పారిపోయిన అసమర్థుడు యడ్యూరప్ప'
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ శనివారం కర్ణాటక గవర్నర్ వాజుబాయి వాలాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి, బీజేపీకి విధేయతతో గవర్నర్ పని చేస్తున్నారని చెప్పే ఉద్దేశ్యంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి, యడ్యూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ చూపిన విధేయత చూసిన ప్రతి భారతీయులు వారి కుక్కలకు ఆయన పేరు పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు.
సై అని, పారిపోయిన అసమర్థుడు యడ్యూరప్ప
ఫ్లోర్ టెస్టుకు అంగీకరించి, బీజేపీ నేత యడ్యూరప్ప అసమర్థుడిగా పరారవడం ప్రజాస్వామ్య విజయమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య అన్నారు.
విశ్వాస పరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయడంతో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆనందిస్తున్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను ఆహ్వానించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు.
ప్రజాతీర్పును అంగీకరించడం ప్రజాస్వామ్యవాదుల కర్తవ్యమన్నారు. బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు అభ్యంతరకరమన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలును గవర్నర్ ప్రోత్సహించారన్నారు. ఇవాళ చారిత్రాత్మక రోజని, ఈ విజయం రాజ్యాంగం సాధించిన విజయమన్నారు. విశ్వాస పరీక్షకు ఎదుర్కొనే సంఖ్యాబలం యడ్యూరప్పకు లేదని ప్రధాని మోడీ, అమిత్షా గవర్నర్పై ఒత్తిడి తెచ్చారన్నారు.
అనునిత్యం అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలో అవినీతిని ప్రోత్సహించారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కేంద్రమంత్రి అనంత్ కుమార్ రాహుల్ వ్యాఖ్యల్ని ఖండించారు. ప్రధాని నరేంద్ర మోడీపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కుంభకోణాలు లేని ప్రభుత్వాన్ని మోడీ నడుపుతున్నారన్నారు. ప్రధానిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే రాహుల్కు మతిపోయిందని ప్రజలు అనుకుంటారన్నారు.