వచ్చే ఎన్నికల్లో BJP విజయంపై శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు!
2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 2019లో సాధించిన విజయాన్ని పునరావృతం చేయడం అసాధ్యమేనని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల ఫలితాల్లో వచ్చిన సీట్ల సంఖ్యతో పోలిస్తే 50 సీట్లను కోల్పోవచ్చని ఆయన అంచనా వేశారు. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో శశి మాట్లాడుతూ 2019లో భారతీయ జనతాపార్టీ సాధించిన విజయం 2024లో పునరావృతం కాకపోవచ్చని, మెజార్టీ మార్కుకంటే కిందకు పడిపోవడం కూడా జరగొచ్చన్నారు. పుల్వామా, బాలాకోట్ దాడులు చివరి నిమిషంలో ప్రభావం చూపాయని, రానున్న ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావని వెల్లడించారు.
కమలం పార్టీ 50 సీట్లు కోల్పోవడమనేది అందరూ ఊహించదగిందేనని, అది ప్రతిపక్షాలకు లాభదాయకంగా మారొచ్చని, ఆ సమయంలో విపక్షపార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయో? లేదో? కూడా చెప్పడం కష్టమేనన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా లోక్ సభ స్థానాలను దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాల నుంచి మాట్లాడేటప్పుడు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుందన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, బాల్ ఠాక్రే, ములాయం సింగ్ యాదవ్, కరుణానిధి, శరద్ పవార్ పార్టీలో వారి తర్వాత తరం కూడా రాజకీయంలో ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు.
వారసత్వ రాజకీయాలపై దేశంలో దుమారం రేగింది. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడేవారు అమిత్ షా కుమారుడు జైషా బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో భారత రాష్ట్ర సమితి, తెలుగుదేశం, డీఎంకే, జేడీఎస్ లాంటి పార్టీల్లో కూడా తర్వాత తరం కొనసాగుతోందనే విషయాన్ని గమనించాల్సి ఉంటుందంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వారసత్వ రాజకీయాలనేవి ఎక్కువగా ప్రాంతీయ పార్టీల్లో ఉన్నాయి.