రామమందిర్ కట్టండి: మోడీకి కాంగ్రెస్ నేత, నితీష్ గ్రీట్స్
గాంధీనగర్: కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యాంగ పరిధికి లోబడి అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని గుజరాత్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, కాంగ్రెసు సీనియర్ నాయకుడు శంకర్ సిన్హ వాఘేలా బుధవారం అన్నారు. మోడీకి వీడ్కోలు ఇవ్వడం కోసం బుధవారం గుజరాత్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా వాఘేలా మాట్లాడారు.
అద్వానీ రథయాత్ర ద్వారా ఓట్లు పొంది అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్డీయే కారణంగా వాజపేయి మందిరాన్ని నిర్మించలేకపోయారని, ఇప్పుడు బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సీట్లు సాధించిందని, బిజెపి చెప్పినట్లు రాజ్యాంగానికి లోబడి రామ మందిరం నిర్మించాలని సూచించారు.
ఉమ్మడి పౌరస్మృతిని రద్దు చేసి కాశ్మీర్ పండిట్లకు కాశ్మీర్లో పునరావాసం కల్పిస్తామని చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ద్రవ్యోల్భణాన్ని 25 శాతం తగ్గించి ధరలను అదుపు చేస్తామన్నారని, తాము ఫలితం కోసం ఏడాది ఎదురు చూస్తామన్నారు. 1982లో రెండు సీట్లు గెలిచిన బిజెపిని... మోడీ 282 సీట్లలో గెలిపించారని కితాబిచ్చారు.
మోడీకి నితీష్ అభినందనలు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన బద్ధ శత్రువు అయిన మోడీకి అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి ప్రధాని పదవిని అధిష్టించబోతున్న మోడీకి నా అభినందనలు, శుభాకాంక్షలు అని నితీష్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. బీహార్ సిఎంగా బాధ్యతలు చేపట్టిన జీతన్ రాం మాంఝీకి మోడీ అభినందనలు తెలిపారు. దీంతో నితీష్ స్పందించారు.