ఇప్పుడూ చిల్లర రాజకీయాలేనా?: సోనియాపై అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై దేశం పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడంమాని, దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలని హితవు పలికారు.

సోనియాకు కౌంటర్..
దేశవ్యాప్త లాక్డౌన్ విధించిన విషయంలో కేంద్రం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించలేదంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించిన నేపథ్యంలో అమిత్ షా ఈ మేరకు స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని దేశం కరోనా మహమ్మారిపై పోరాడుతోందని, ఈ క్రమంలో 130 కోట్ల మంది ఒక్కటయ్యారని అమిత్ షా వ్యాఖ్యానించారు.
విపత్కర సమయంలోనూ చిల్లర రాజకీయలేనా?
ఈ సమయంలో కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను తప్పుదోవపట్టించేలా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. జాతి ప్రయోజనాల కోసం ఆలోచించాలని అమిత్ షా.. సోనియా గాంధీ, ఆమె నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి హితవు పలికారు.
Recommended Video

సరైన ప్రణాళిక ఏదంటూ సోనియా..
కాగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్లో మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సరైన ప్రణాళిక లేకుండానే లాక్డౌన్ అమలు చేస్తోందంటూ మండిపడ్డారు. లాక్ డౌన్ వల్ల పేదలు ఇబ్బంది పడుతున్నారని, వారిని వెంటనే ఆదుకోవాల్సి ఉందని అన్నారు. వలస కుటుంబాలు, కూలీలు ఇబ్బందులపాలవుతున్నారని అన్నారు. అంతేగాక, చిన్న, మధ్య తరహా పరిశ్రమలన్నీ మూతపడటంతో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని, పారిశ్రామిక వేత్తలకు తగిన ప్యాకేజీ అవసరమని సోనియా వ్యాఖ్యానించారు. కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలు, ఐసోలేషన్ వార్డుల వివరాలు, క్వారంటైన్ ఏర్పాట్లు వంటి అంశాలను కామన్ పీపుల్కు అందుబాటులో ఉంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ భేటీ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానంగా సోనియా గాంధీ లాక్ డౌన్ పరిస్థితిపైనా, కరోనా వైరస్ వ్యాప్తిపైనా చర్చించారు . మానవాళి సంక్షోభంలో వున్న సమయంలో ఇలా కలుస్తున్నందుకు బాధగా ఉందన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాలు చాలా పెద్దదని, అయినా దాన్ని అధిగమిస్తామన్న నమ్మకం ఉందని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications