ఎమ్మెల్యే ఎన్నికలకు డుమ్మా, నేడు స్థానిక ఎన్నికలకు మాజీ ఎంపీ రమ్యా, ఢిల్లీలో మకాం!
బెంగళూరు: కర్ణాటకలో సిటి మునిసిపల్ కార్పొరేషన్, పుర సభ ఎన్నికలు ఆగస్టు 31వ తేదీ శుక్రవారం జరుగుతున్నాయి. రానున్న లోక్ సభ ఎన్నికలకు శుక్రవారం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ట్రయల్స్ అని ఇప్పటికే ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ రమ్యా ఇంత వరకూ రాలేదు.
బరిలో మూడు పార్టీలు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం కావడంతో ఓటు వెయ్యడానికి ప్రజలు క్యూకట్టారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్- జేడీఎస్ పార్టీలు ఈ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు పోటీగా బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు.
9,121 మంది పోటీ
రాష్ట్రంలోని 2,574 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2,574 వార్డుల్లో మొత్తం 9,121 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. శుక్రవారం ఓటర్లు ఏ పార్టీలకు పట్టం కడుతారో అని ఉత్కంఠ మొదలైయ్యింది. ఇప్పటికే సిటి మునిసిపల్ కార్పొరేషనల్లో 12 వార్డులు, పుర సభలలో 17 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీంగా ఎన్నిక అయ్యారు.
మాజీ ఎంపీ రమ్యా
మండ్య లోక్ సభ నియోజక వర్గం మాజీ ఎంపీ, బహుబాష నటి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్ రమ్యా అలియాస్ దివ్యా స్పందన శుక్రవారం మద్యాహ్నం వరకు ఓటు హక్కు వినియోగించుకోలేదు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన రమ్యా ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్నారు.
ఎమ్మెల్యే ఎన్నికలకు డుమ్మా
మండ్యలోని నగర సభ వార్డు నెంబర్ 11లో మాజీ ఎంపీ రమ్యాకు ఓటు ఉంది. గత శాసన ఎన్నికల సందర్బంగా మాజీ ఎంపీ రమ్యా తన ఓటు హక్కు వినియోగించుకోకుండా ఢిల్లీలోని ఉండిపోయారు. శుక్రవారం సాయంత్రం లోపు అయినా రమ్యా మండ్య చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటారా ? లేక ఢిల్లీకే పరిమితం అవుతారా? అంటూ మండ్య ప్రజలు చర్చించుకుంటున్నారు.
మండ్యకు దూరం
మండ్యలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన రమ్యా తరువాత స్థానిక ప్రజలకు దూరంగా ఉంటున్నారు. రమ్యా తల్లి రంజితా మండ్యలో క్రీయాశీల రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. మండ్య నగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రమ్యా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. రమ్యా ఎప్పుడు వస్తారా అంటూ స్థానిక మీడియా సభ్యులు ఆ పోలింగ్ కేంద్రం దగ్గర వేచి చూస్తున్నారు.