మోడీ ప్రెస్మీట్ వార్తల్ని ఖండించిన బీజేపీ.. మీ వల్ల కాదంటూ కాంగ్రెస్ సటైర్..
ఢిల్లీ : ఎన్నికల సమయం కావడంతో ప్రతిపక్షాలు మోడీని విమర్శించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలుకోవడం లేదు. తాజాగా ఏప్రిల్ 26న వారణాసిలో ప్రధాని నరేంద్రమోడీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారంటూ వచ్చిన వార్తలపై కాంగ్రెస్ ఆయనను కౌంటర్ చేసింది. శుక్రవారం మోడీ వారణాసిలో ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొంటారంటూకొన్ని ఛానెళ్లు, పత్రికల్లో వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన బీజేపీ అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది.
గ్రాండ్ షో : మోడీ నామినేషన్ సర్వం సిద్ధం..అంతకంటే ముందు ఇదీ ప్రధాని షెడ్యూల్
మోడీ ఎలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. ఇదే అదునుగా కాంగ్రెస్ మోడీపై విమర్శలు ఎక్కుపెట్టింది. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమాలోని డైలాగ్ను అనుకరిస్తూ తుమ్ సే నా హో పాయేగా (మీ వల్ల కాదు) అంటూ ట్విట్టర్లో సటైర్ వేసింది.
"Tum se na ho payega" #FekuModi https://t.co/zW7S6tzME4
— Congress (@INCIndia) April 24, 2019
మోడీ ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక్కసారి కూడా ప్రెస్మీట్ నిర్వహించకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆయన ఒకట్రెండు సార్లు కొన్ని ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చినా జర్నలిస్టులు మోడీ దృష్టి కోణంలోనే ప్రశ్నలు అడిగారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్కు మోడీ ఇచ్చిన ఇంటర్వ్యూపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సమయంలో రాహుల్ గాంధీ సైతం మోడీ ప్రెస్ కాన్ఫరెన్స్ అంశాన్ని ప్రస్తావించారు. మీడియా అడిగే ప్రశ్నలకు జవాబిచ్చే ధైర్యంలేకనే ఆయన ప్రెస్మీట్ నిర్వహించడంలేదని విమర్శించారు.