మోడీపై పోటీ: సచిన్ వైపు చూపు, నో చెప్పిన మాస్టర్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని వారణాసి నుండి ఎలా ఎదుర్కోవాలో కాంగ్రెసు పార్టీ తర్జన భర్జన పడుతోంది. ఇందులో భాగంగా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ వైపు కాంగ్రెసు పార్టీ అధిష్టానం దృష్టి సారించిందంటున్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మోడీ వారణాసితో పాటు వడోదర లోకసభ స్థానాల నుండి పోటీ చేయనున్నారు. వారణాసిలో ఆయనను ఎదుర్కొనేందుకు ధీటైన అభ్యర్థి కోసం కాంగ్రెసు వేట ప్రారంభించింది. సమాచారం మేరకు... అధిష్టానం దృష్టి రాజ్యసభ సభ్యుడు అయిన సచిన్ పైన పడింది.
ప్రజాకర్షణలో మోడీకి సచిన్ ఏమాత్రం తీసిపోడన్నది కాంగ్రెస్ వర్గాల భావన అంటున్నారు. అందుకే వారణాసి నుండి పోటీకి దింపే విషయమై సచిన్తో కాంగ్రెసు పెద్దలు సంప్రదింపులు జరిపినట్లుగా చెబుతున్నారు. అయితే, మోడీపై పోటీకి సచిన్ విముఖత ప్రదర్శించినట్టు తెలుస్తోంది. సచిన్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు.
వారణాసిలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి 2004లో గెలుపొందారు. రాజేష్ కుమార్ మిశ్రా అప్పుడు గెలిచారు. అయితే, 2009లో బిజెపి నేత మురళీ మనోహర్ ఈ స్థానంలో గెలిచారు. కాగా, మోడీ పైన పోటీ చేసేందుకు తాను సిద్ధమని కాంగ్రెసు సీనియర్ నేత ఆనంద్ శర్మ బుధవారం చెప్పారు. పార్టీ కోరుకుంటే తాను ఇప్పుడే లగేజీ సదురుకొని వారణాసి బయలుదేరుతానని చెప్పారు.