సభలో రభస: హర్ష అవిశ్వాసం, లగడపాటి హెచ్చరిక
అంతకుముందు తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వంపై సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యుడు హర్ష కుమార్, సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లోక్సభ స్పీకర్కు అవిశ్వాస తీర్మాన నోటీసును అందజేశారు. కాంగ్రెసు పార్టీ తరఫున రోజుకు ఒకరు నోటీసు ఇస్తున్నారు. బుధవారం ఉండవల్లి, గురువారం సబ్బం హరిలు ఇవ్వగా ఈ రోజు హర్షకుమార్ ఇచ్చారు.
టైటానిక్ షిప్లా మునగక తప్పదు: లగడపాటి
రెండుసార్లు అధికారాన్ని ఇచ్చిన తెలుగు జాతిని చీల్చితే కాంగ్రెసు పార్టీ టైటానిక్ షిప్లా మునగక తప్పదని విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ శుక్రవారం అన్నారు. బిల్లు పెడతామంటే తాము సభను నిమిషం కూడా జరగనివ్వమని హెచ్చరించారు. తమ దగ్గర మరిన్ని అస్త్రాలు ఉన్నాయని తెలిపారు. ఓ ముఖ్య నేత కేంద్రానికి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. తమ వద్ద ఉన్న అన్ని అస్త్రాలను ఒక్కటొక్కటిగా ఉపయోగిస్తామని చెప్పారు.
సమైక్యాంధ్ర కోసం తాము దేనికైనా సిద్ధమన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటూ సాకులు చూపి తెలంగాణ బిల్లును పాస్ చేసే యత్నంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉందన్నారు. హైకమాండ్ కు చిత్తశుద్ధి ఉంటే యూటి అంశాన్ని బిల్లులో చేర్చి మరోసారి అసెంబ్లీకి పంపాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో బిల్లు పాస్ అయితే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.