విధులలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ సజీవదహనం
న్యూఢిల్లీ: పోలీసు కార్యాలయంలో విధులలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ సజీవదహనం అయిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. సజీవదహనం అయిన హెడ్ కానిస్టేబుల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
దక్షిణ ఢిల్లీలోని ఆర్ కే పురంలో సీఆర్ పీఎఫ్ కార్యాలయం ఉంది. హెడ్ కానిస్టేబుల్ లింగం గౌడ్ (40) శుక్రవారం రాత్రి ఈ కార్యాలయం నాలుగవ అంతస్తులోని ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ (ఈడీపీ) ముందు విధులలో ఉన్నారు. అర్దరాత్రి అతను కార్యాలయం లోపల నిద్రపోయాడు.

శనివారం వేకువ జామున మూడు గంటల సమయంలో కార్యాలయంలో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. లింగం గౌడ్ మంటలలో చిక్కుకున్నాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 7 వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మంటలు అదుపు చేసే సమయానికి లింగం గౌడ సజీవదహనం అయ్యాడు. విషయం తెలుసుకున్న సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. విద్యుత్ షార్ట్ సర్కూట్ వలన మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications