శశికళకు వ్యతిరేకంగా కానిస్టేబుల్ నిరాహార దీక్ష.. భగ్నం చేసిన పోలీసులు
అప్పట్లో ప్రకటించినట్లుగానే మురుగన్ తాజాగా నిరాహార దీక్ష చేపట్టాడు. శశికళకు వ్యతిరేకంగా మురుగన్ ఈ దీక్షను చేపట్టడం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
చెన్నై: జయలలిత మరణానంతరం అన్నాడీఎంకె రాజకీయాలు అనేక మలుపులు తీసుకోవడంతో.. తమిళ జనమంతా శశికళ-పన్నీర్ వర్గంగా విడిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో జయలలితకు వీరాభిమాని అయిన వేల్ మురుగన్ (43) అనే ఓ పోలీస్ కానిస్టేబుల్ అప్పట్లో పన్నీర్ సెల్వంకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు.
అంతేకాదు, శశికళ సీఎం కావడాన్ని నిరసిస్తూ, చెన్నైలోని మెరీనా బీచ్ లో ఆమరణ దీక్ష చేపడుతానని అప్పట్లో ఓ ప్రకటన కూడా చేశాడు. వద్దని పోలీస్ అధికారులు అతన్ని హెచ్చరించినా.. తను మాత్రం తీరు మార్చుకోలేదు. దీంతో అతన్ని పోలీస్ శాఖ నుంచి సస్పెండ్ చేశారు.
అప్పట్లో ప్రకటించినట్లుగానే మురుగన్ తాజాగా నిరాహార దీక్ష చేపట్టాడు. శశికళకు వ్యతిరేకంగా మురుగన్ ఈ దీక్షను చేపట్టడం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది. తేని జిల్లా గూడలూరు లోయర్ క్యాంప్ లో మురుగన్ నిరహారదీక్ష విషయం తెలుసుకున్న పోలీసులు.. దీక్షను భగ్నం చేశారు. అనుమతులు లేకుండా దీక్ష చేపట్టరాదంటూ అతన్ని అరెస్టు చేశారు.
కాగా, జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోజుల్లో.. ఆమె పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని, మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టాలని కోరుతూ యూనిఫాంలోనే తలనీలాలు సమర్పించుకున్నాడు. ప్రభుత్వ పోస్టులో ఉండి ఇలా వ్యవహరించడం పట్ల మురుగన్ పై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.