ప్రధానిపై పోటీ చేస్తా..! కారణం అదేనన్న జవాన్..!!
వారణాశి/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. ప్రచారానికి సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు ప్రజా క్షేత్రంలో తలమునకలౌతున్నాయి. ప్రాంతీయ పార్టీల దగ్గర నుండి జాతీయ పార్టీల వరకు అన్ని పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు అనేక ప్రణాళికలు రచిస్తున్నాయి. అటు ప్రధాని కూడా రెండవ సారి ఢిల్లీ పీఠాన్ని అదిరోహించేందుకు ఇవ్విళ్లూరుతున్నారు. అందులో బాగంగా దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ పైన ఎన్నికల బరిలో తలబడతానని దేశాన్ని రక్షించే ఓ జవాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
జవాన్ల సదుపాయాలు మెరుగుపడాలి..! ప్రభుత్వాల నిర్లక్ష్యం తగదన్న జవాన్..!!
రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బరిలోకి దిగుతున్న వారణాశి నియోజకవర్గం నుంచి తాను కూడా పోటీ చేయనున్నట్లు బీఎస్ఎఫ్ మాజీ జవాను తేజ్ బహదూర్ యాదవ్ వెల్లడించారు. జవాన్లకు సరైన ఆహారం ఇవ్వడం లేదంటూ సోషల్మీడియాలో వీడియో పోస్టు చేసి బహదూర్ రెండేళ్ల క్రితం వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానంటూ బహిరంగ ప్రకటన చేసారు.
వారణాసిలో పోటీ చేస్తా..! జవాన్ల హక్కులు సాధిస్తానంటున్న బహదూర్..!!
హరియాణాలోని రేవారి ప్రాంతానికి చెందిన బహదూర్.. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు చెప్పగానే చాలా రాజకీయ పార్టీలు తనను సంప్రదించాయని, అయితే తాను స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానని వెల్లడించారు. భద్రతాబలగాల్లో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడేందుకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు బహదూర్ తెలిపారు.
ప్రధానిపై తీవ్ర ఆరోపణలు..! జవాన్ల పేరుతో ఓట్లడగడం మంచిది కాదన్న బహదూర్..!!
‘ఎన్నికల్లో గెలవడం, ఓడటం అనేది కాదు.. భద్రతాబలగాలు ముఖ్యంగా పారామిలిటరీ దళాల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు ఈ పోటీకి దిగుతున్నా. జవాన్ల పేరు చెప్పి ఓట్లు సంపాదించేందుకు మోదీ యత్నిస్తున్నారు. కానీ ఆ జవాన్ల కోసం ఆయన ప్రభుత్వం ఏమీ చేయలేదు. పుల్వామా దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోతే కనీసం వారికి అమరుల హోదా కూడా ఇవ్వలేదు' అని బహదూర్ ఈ సందర్భంగా విమర్శించారు.
భద్రతాసిబ్బందికి నాణ్యతలేని ఆహారమా..! అవమానకరం అంటున్న జవాన్..!!
జమ్ముకశ్మీర్లోని భద్రతాసిబ్బంది నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారంటూ 2017లో బహదూర్ సోషల్మీడియా వేదికగా ఆరోపణలు చేశారు. ఆ తర్వాత క్రమశిక్షణా చర్యల కింద ఆయనను విధుల నుంచి తొలగించారు. దీంతో బహదూర్ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. దేశాన్ని కాపాడే జవాన్ల విషయంలో ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని, ఇలాంటి వైఖరి కి స్వస్తి పలకాలని బహదూర్ చెప్పుకొస్తున్నారు.