సన్యాసినుల అవతారమెత్తి మరీ.. పోలీసుల చేతిలో జూహీ ఇలా బుక్కయింది..
నిజానికి అప్పటికే పారిపోదామని అప్రమత్తంగా ఉన్న జూహీ చౌదరి పోలీసులు సన్యాసినుల అవతారంలో రావడంతో అడ్డంగా బుక్కయిపోయింది.
కోల్ కతా: వలపన్ని పట్టుకోవడం వేరు.. ప్రత్యక్ష దాడికి దిగి నేరస్తులను అరెస్టు చేయడం వేరు. మొదటి దానికి సంబంధించి పోలీసులకు కొత్త కసరత్తు తప్పనిసరి. పక్కా ప్లాన్, పక్కా టైమింగ్ తో వ్యవహరిస్తే తప్ప నేరస్తులు చిక్కరు. సరిగ్గా ఇదే పాయింట్ మీద ఫోకస్ చేసిన కోల్ కతా పోలీసులు ఏకంగా సన్యాసుల అవతారమెత్తి ఓ నేరస్తురాలిని బురిడీ కొట్టించారు.
పిల్లల అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉన్న జూహీ చౌదరిని కోల్ కతా పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకోసం వారు సన్యాసిని అవతారమెత్తారు. నిజానికి అప్పటికే పారిపోదామని అప్రమత్తంగా ఉన్న జూహీ చౌదరి పోలీసులు సన్యాసినుల అవతారంలో రావడంతో అడ్డంగా బుక్కయిపోయింది.
నేపాల్ కు కేవలం పది నిముషాల దూరంలో ఉండే ప్రాంతంలో జూహీ చౌదరీ తలదాచుకుంది. వాస్తవానికి కేసు బయటపడగానే ఆమె నేపాల్ పారిపోయింది. ఈమధ్యే నేపాల్ సరిహద్దులో ఉన్న ఓ భారత గ్రామానికి తిరిగి వచ్చింది. పోలీసులు గుర్తిస్తే తిరిగి పారిపోయేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంది.
జూహీ చౌదరి ఆచూకీని కనుగొన్న పోలీసులు పక్కా ప్లాన్ తో ముందుకెళ్లారు. సన్యాసినిల రూపంలో రెక్కీ నిర్వహించారు. చివరకు ఓరోజు అదే అవతారంలో జూహీ ఇంట్లో వాలిపోయారు. బాధలో ఉన్న నిన్ను ఓదారుస్తామని నమ్మబలికారు. వీరి మాటల పట్ల జూహీ ఓ అంచనాకు వచ్చే లోపే.. ఆమె రెండు భుజాలను పట్టుకుని, బయట ఉన్న పోలీస్ జీపు దాకా లాక్కొచ్చారు.
అనంతరం అదే జీపులో స్టేషన్ కు తరలించారు. డార్జిలింగ్ సమీపంలోని ఖైరాబరి అనే ప్రాంతంలో జూహీని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, పశ్చిమబెంగాల్ లోని జుల్పాయిగురి ప్రాంతంలో పిల్లలను అక్రమ రవాణా చేస్తున్న రాకెట్ లో జూహీ చౌదరి ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. అప్పట్లో బీజేపీలో ఉన్న జూహీని.. నేరం గురించి తెలియగానే పార్టీ ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసింది.