కరోనా : ఈ-పాస్గా ఆరోగ్య సేతు..? సాధ్యమేనా...? సైబర్ నిపుణులు ఏమంటున్నారు..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ను మున్ముందు సిటిజెన్స్ ఈ-పాస్గా ఉపయోగించబోతున్నారా... అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఈ-పాస్ ఉన్నవారినే బయట తిరిగేందుకు అనుమతిస్తారన్న మాట. కేంద్ర అధికారిక వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందేమోనన్న ప్రచారం జరుగుతోంది. ఆరోగ్య సేతు యాప్లో ఈ రకమైన కార్యారచరణ రూపొందించడం కోసం తమకు సూచనలు అందాయని... దాని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని ఎలక్ట్రానిక్స్&ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. లాజిస్టిక్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రూప్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అయితే ఈ విధానం ద్వారా పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు, న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్య సేత యాప్.. ఎందుకోసం..
ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకున్నవారు మొదట వారి వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్,పేరు,వయసు,జెండర్ ఇతరత్రా వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.అలాగే సెల్ఫోన్ బ్లూ టూత్,లొకేషన్ నిరంతరం ఆన్ మోడ్లో ఉంచాలి. తద్వారా కోవిడ్ 19 పేషెంట్ ఎవరైనా మీ సమీపంలో ఉన్నట్టయితే యాప్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. అంతేకాదు, జీపీఎస్ ద్వారా మీరు ఆ ఆ వ్యక్తిని ఎప్పుడైనా కలిశారా అన్న విషయం కూడా కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది.
యాప్ సమస్యలపై సైబర్ నిపుణులు..
అయితే ఈ యాప్ ద్వారా ఇంటరాక్షన్స్ను ఎలా గుర్తిస్తారో స్పష్టత లేదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు. అంతేకాదు, ఎంతమంది కరోనా పాజిటివ్ పేషెంట్స్ దీన్ని డౌన్ లోడ్ చేసుకున్నారన్న దానిపై యాప్ సమర్థత ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఈ యాప్ సమర్థవంతంగా పనిచేయాలంటే.. మూడు విషయాలను ఇది నెరవేర్చాలని చెన్నై కేంద్రంగా పనిచేసే ఓ ఇండిపెండెంట్ సైబర్ నిపుణుడు చెప్పారు. ఒకటి.. దేశవ్యాప్తంగా తగినన్ని కరోనా వైద్య పరీక్షలు జరిపించాలి. రెండు.. కరోనా పాజిటివ్ పేషెంట్లందరికీ స్మార్ట్ ఫోన్.. అందులో ఈ యాప్ తప్పనిసరిగా ఉండాలి. మూడు.. ఈ రెండు అంశాల ఆధారంగా ఇంటర్-మొబైల్ కమ్యూనికేషన్ ద్వారా కరోనా క్లస్టర్స్ను గుర్తించడం.
బ్లూటూత్ సమస్యలు...
ఇక మరో సమస్య బ్లూ టూత్ రూపంలో తలెత్తవచ్చునని చెబుతున్నారు. ఈ యాప్ పనిచేయాలంటే నిరంతరం బ్లూ టూత్,జీపీఎస్ ఆన్ చేసి ఉంచాలని.. అయితే నెట్వర్క్ సిగ్నల్ సమస్య తలెత్తితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే బ్లూటూత్ 2.4GHz బ్యాండ్పై పనిచేస్తుందని.. అదే సమయంలో సమీపంలో ఎక్కువ సంఖ్యలో బ్లూటూత్ డివైజ్లు ఆన్ చేసి ఉంచినా.. లేకపోతే వైఫ్ రౌటర్స్ ఆన్లో ఉన్నా.. సిగ్నల్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు.
ప్రమాదంలో వ్యక్తిగత డేటా..?
ఆరోగ్య సేతు లాంచ్ తర్వాత దాదాపు 1.5కోట్ల మంది దీన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు. అయితే దీన్ని ప్రారంభించినప్పటి నుంచి ప్రైవసీ సమస్యలను నిపుణులు లేవనెత్తుతూనే ఉన్నారు. దాదాపు 9 సంస్థలు,11 మంది వ్యక్తులు దీనిపై కేంద్రానికి లేఖలు రాశారు. ఇందులో సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్(SFLC) కూడా ఉంది. ఈ సంస్థ ప్రకారం ఆరోగ్య సేతు యాప్తో అనేక సమస్యలున్నాయి. క్లౌడ్లోకి అప్లోడ్ చేసిన వ్యక్తిగత సమాచారాన్ని ఇతర అవసరమైన మరియు సంబంధిత వ్యక్తులతో పంచుకోవడానికి యాప్ ప్రైవసీ పాలసీ అనుమతిస్తోందని చెబుతున్నారు. అయితే భారత్లో వ్యక్తిగత డేటా రక్షణ కోసం ఎలాంటి చట్టాలు లేనందునా.. ఈ రకమైన ధోరణి సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు,ఒకవేళ ఈ యాప్లో ఉండే సమాచారం సరైంది కాకపోతే దానికి ప్రభుత్వం బాధ్యత వహించకుండా ఇందులో మినహాయింపులు ఉన్నాయని.. ఈ లెక్కన ఒకవేళ వ్యక్తిగత డేటా లీకైనా ప్రభుత్వానికి బాధ్యత ఉండకపోవచ్చునని చెబుతున్నారు.