చాపకింద నీరులా విస్తరిస్తోన్న కరోనా?
కరోనా కథ ముగిసిపోయింది.. గతంలోలా హాయిగా ఉండొచ్చు అనుకుంటున్న తరుణంలో దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసుల్లో పెరుగుదల చోటుచేసుకుంటోంది. కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజులుగా ప్రతిరోజు మూడువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో 3.60 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా 3451 కేసులు పాజిటివ్ గా తేలాయి. 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కొవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 5.24 లక్షలకు చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలోనే 1407 కేసులు నమోదవగా, మహారాష్ట్రలో 253 కేసులు నమోదయ్యాయి.
కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య తక్కువగా ఉంటోంది.
దేశవ్యాప్తంగా 20వేలకు పైగా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
కేంద్ర ఆరోగ్యశాఖ టీకాల పంపిణీని నిరంతరాయంగా కొనసాగిస్తోంది. శనివారం ఒక్కరోజే 17.39 లక్షల మందికి టీకాలిచ్చారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 190.20 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం ప్రకటించింది.
ప్రయివేటు ఆసుపత్రుల్లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ రూ.225 కే అందుబాటులో ఉంటున్నాయని, బూస్టర్ డోస్ అవసరమైనవారందరికీ మెసేజ్ లు పంపించామని, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలున్నవారు బూస్టర్ డోస్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. సాధ్యమైనంతవరకు ముఖానికి మాస్క్ లు ధరించడం, తరుచుగా చేతులు శానిటైజ్ చేసుకోవడం చేయాలని, భౌతిక దూరం పాటించాలని కోరుతోంది.
కొవిడ్ వల్ల భారతదేశంలో 47 లక్షల మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆక్సిజన్ కొరతవల్లే ఎక్కువమంది మృత్యువాత పడ్డారని తెలిపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలను కాపాడటానికి తాము అన్నివిధాల ప్రయత్నించామని, అన్నిచోట్ల ఆక్సిజన్ అందుబాటులో ఉంచామని, ఇటువంటి ఆరోపణలు నిరాధారమని, అంతర్జాతీయంగా భారతదేశాన్ని అప్రతిష్టపాల్జేయడానికే ఇలా ప్రకటిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వం మండిపడింది.