కేరళ సమూహ వ్యాప్తికి చేరిందా?: అంతుచిక్కని ఆ 25 కేసులు, 2 మరణాలు
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కరోనావైరస్.. మరోసారి విజృంభిస్తుండటంతో ప్రజల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. తాజాగా నమోదైన 25 కరోనా పాజిటివ్ కేసులు ఎవరి నుంచి వ్యాపించాయో తెలియకపోవడంతో కేరళ రాష్ట్రంలో కరోనా మూడో దశకు చేరిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

25 కేసుల్లో రెండు మరణాలు
కోజికోడ్ మెడికల్ కాలేజీలో మృతి చెందిన నాలుగు నెలల చిన్నారి, కన్నూరులోని పరియారం వైద్య కళాశాలలో మరణించిన 71 ఏళ్ల వృద్ధుడు కూడా ఈ 25 మంది కరోనా బాధితులలోని వారే కావడం గమనార్హం. తాము అత్యంత జాగ్రత్తగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, ఇప్పటి వరకైతే సమూహ వ్యాప్తి సూచనలు ఎక్కడా కనిపించలేదని కేరళ వైద్యారోగ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
కరోనా హాట్ స్పాట్స్, ఇతర ప్రాంతాల్లో ర్యాండమ్ పరీక్షలు నిర్వహించాక నిర్ధారణకు వస్తామని తెలిపారు.

సమూహ వ్యాప్తి లేదంటూ వైద్యశాఖ
కేరళ వైద్యారోగ్య శాఖ మంత్రి కేకే శైలజ మాట్లాడుతూ.. ఏప్రిల్ 21 నుంచి కోరులకున్నవారి రేటుతో పోలిస్తే కరోనా సోకిన వారి సంఖ్య రాష్ట్రంలో ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే, రాష్ట్రంలో సమూహ వ్యాప్తి లేదని స్పష్టం చేశారు. సమూహ వ్యాప్తికి ఎలాంటి ఆధారాలు లేవు, భయపడాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికైతే పరిస్థితి అదుపులోని ఉందని చెప్పారు.

వైద్య సిబ్బందికి కూడా కరోనా..
కాగా, గత ఐదు రోజులుగా కొల్లం, కొట్టాయం, ఇడుక్కి, కోజికోడ్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కొట్టాయం, ఇడుక్కి రోగులు కోలుకోవడంతో ప్రభుత్వం ఆ జిల్లాల్లో ఆంక్షలు సడలించింది. ఇప్పుడు మళీ కేసులు పెరగడంతో 11 గ్రామాలను హాట్ స్పాట్స్గా ప్రకటించింది. ఏప్రిల్ 26న కేరళలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక ప్రభుత్వ వైద్యుడు, ఇద్దరు నర్సులు కూడా ఉండటం గమనార్హం. ఏడుగురికి స్థానికంగా వైరస్ వ్యాపించిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే మిగిలినవారికి ఎలా సోకిందో తెలియడం లేదని పేర్కొంది.

కేరళ మూడో దశకు చేరిందా? అప్రత్తమత్తంగా లేకుంటే..?
వైద్యులు, వైద్య సిబ్బందికి కూడా కరోనా సోకడంపై ఆరోగ్యశాఖలో సీనియర్ అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. సమూహ వ్యాప్తి ద్వారా లేదా పీపీఈలను సరిగ్గా ఉపయోగించకపోవడం, లేదా రోగులకు చికిత్స చేస్తుండగా నాసీరకం పీపీఈ కిట్లు వాడటం వల్ల వైద్య సిబ్బందికి కరోనా సోకి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మరో అధికారి మాత్రం రాష్ట్రంలో కరోనా మూడో దశకు చేరిందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రజలు ఎవరూ బయటికి రావొద్దన్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటివి తప్పనిసరి అని తెలిపారు.












Click it and Unblock the Notifications