ఢిల్లీలో లాక్డౌన్ పై సీఎం కేజ్రీవాల్ క్లారిటీ; ఆందోళన వద్దన్న ముఖ్యమంత్రి
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి కట్టడి నేపథ్యంలో కరోనా కఠిన ఆంక్షలను తీసుకొచ్చిన కేజ్రీవాల్ ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తుంది అన్న భావన వ్యక్తమైంది. అయితే ఢిల్లీలో లాక్డౌన్ ఉండబోదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో సానుకూలత రేటు ఏడు నెలల గరిష్టంగా 25 శాతంగా ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.
ఢిల్లీ లో నో లాక్ డౌన్ .. ఆందోళన వద్దన్న ఢిల్లీ సీఎం
దేశ రాజధాని ఢిల్లీలో తాజా పరిస్థితిపై మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ ప్రజలెవరూ చింతించ వద్దన్నారు. తాము లాక్డౌన్ విధించబోము అని ఢిల్లీ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాజధానిలో కేసుల పెరుగుదలతో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మంగళవారం నాడు దాదాపు 22,000 కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కూడా అరవింద్ కేజ్రివాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో దాదాపు 20,000-22,000 కొత్త కోవిడ్-19 కేసులు నమోదవుతాయని తాము భావిస్తున్నామని, గత రెండు రోజులుగా పాజిటివిటీ రేటు దాదాపు 24-25 శాతంగా ఉందని పేర్కొన్నారు.
ఒమిక్రాన్ తేలికపాటి లక్షణాల వల్ల ఆస్పత్రుల్లో చేరికలు తక్కువ .. అయినా అలెర్ట్ అన్న సీఎం
తాము కరోనా కట్టడి దృష్ట్యా ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ వంటి కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నామని అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.కోవిడ్ చికిత్స సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో ఒక ఉన్నత ఆసుపత్రిని సందర్శించి పరిశీలించిన తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. గత సంవత్సరం డెల్టా వేరియంట్ కారణంగా కొనసాగిన ఘోరమైన రెండవ వేవ్తో పోలిస్తే మూడవ వేవ్లో చాలా కేసులు తేలికపాటి లక్షణాలను చూపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఒమిక్రాన్ తేలికపాటిది కానీ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న వేరియంట్ అని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
కరోనా కట్టడికి ఇప్పటికే ప్రైవేట్ కార్యాలయాలకు వర్క్ ఫ్రమ్ హోం, కఠిన నిబంధనలు
ఇప్పటికే కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఢిల్లీలోని అన్ని ప్రైవేట్ కార్యాలయాలు మూసివేయాలని మరియు ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పని చెయ్యాలని ఆదేశించబడింది. అవసరమైన సేవలను అందించే వారికి మాత్రమే కొత్త నిబంధనకు మినహాయింపు ఉంటుందని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ (డిడిఎంఎ) సమావేశంలో నిర్ణయించారు. రెస్టారెంట్లు మరియు బార్లు కూడా మూసివేయబడ్డాయని, టేక్అవేలు మరియు హోమ్ డెలివరీలు మాత్రమే అనుమతించబడతాయని పేర్కొన్నారు. డీడీఎంఏ సమావేశంలో తాము ఆంక్షల కోసం మొత్తం ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) కవర్ చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులను అభ్యర్థించామని, వారు మాకు అదే హామీ ఇచ్చారని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
Recommended Video
ఢిల్లీలో గరిష్ట స్థాయికి కరోనా కేసులు పెరిగే ఛాన్స్ ..
అంతకు ముందు మరో వారాంతపు కర్ఫ్యూ వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు. రాబోయే 48 గంటల్లో లేదా ఖచ్చితంగా ఈ వారంలో ఢిల్లీ నగరంలో కేసులు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చునని అయన పేర్కొన్నారు. కేసుల పెరుగుదల నేపధ్యంలో కఠిన చర్యలు తీసుకుంటూనే మరోవైపు ఢిల్లీ లో లాక్ డౌన్ ఉండబోదని, పరిస్థితిని కంట్రోల్ చెయ్యటానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.