తాజాగా 35వేలను దాటిన కొత్త కేసులు, 281 మరణాలు; టీకా డ్రైవ్ లో భారత్ రికార్డ్ !!
భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. భారతదేశం శనివారం 35,662 కొత్త కోవిడ్ -19 కేసులను నివేదించింది. అంతకు ముందు రోజుతో పోలిస్తే కరోనా కేసులు పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. రోజు రోజుకి కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో నమోదయిన మొత్తం కరోనా కేసులు 3.34 కోట్లకు చేరుకుంది. గత 24 గంటల్లో 281 మంది కరోనా మహమ్మారితో మరణించారు.
భారత్ లో మళ్ళీ భారీగా .. తాజాగా 34,403 కరోనా కేసులు, 320 మరణాలు, పండుగలపై కేంద్రం అలెర్ట్
గత 24 గంటల్లో 281 కరోనా మరణాలు
శనివారం నమోదైన 281 కోవిడ్ సంబంధిత మరణాలలో కేరళలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి.కేరళ రాష్ట్రంలో 131 మంది కరోనా కారణంగా మరణించారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 67 మంది మరణించారు. ఇక కరోనా కారణంగా మృతి చెందిన వారి మొత్తం సంఖ్య 444539. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, గత 24 గంటలలో భారతదేశం 14,48,833 పరీక్షలు నిర్వహించింది. భారత దేశంలో ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసులు 3,40,639 గా ఉన్నాయి. గత 24 గంటల్లో, యాక్టివ్ కేసులు 1,583 పెరిగాయి.
కేరళలో అత్యధికంగా 23,260 కరోనా కేసులు,టాప్ 5 రాష్ట్రాలివే
అన్ని రాష్ట్రాలలో, కేరళలో అత్యధికంగా 23,260 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. తరువాత మహారాష్ట్రలో 3,586 కేసులు, తమిళనాడులో 1,669 కేసులు నమోదు కాగా, మిజోరంలో 1,476 కేసులు మరియు ఆంధ్రప్రదేశ్లో 1,393 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల పెరుగుదల ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఇంకా కోవిడ్ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేంద్రం సూచిస్తుంది. పండుగల సమయంలో జాగ్రత్త వహించాలని కూడా చెప్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని పదేపదే గుర్తు చేస్తుంది.
97.65 శాతానికి పెరిగిన రికవరీ రేటు.. రికార్డు సృష్టించిన టీకా డ్రైవ్
ప్రస్తుతం దేశంలో నమోదైన కేసులో సగానికి పైగా కేసులు ఒక్క కేరళ రాష్ట్రం నుండే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 33,798 మంది రోగులు కోలుకున్నారు.దేశవ్యాప్తంగా మొత్తం రికవరీలు 3,26,32,222 వద్ద ఉండగా, రికవరీ రేటు మరింతగా 97.65 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో భారతదేశంలో రోజువారీ కోవిడ్ సంఖ్యలు మూడు శాతానికి పైగా పెరిగాయి. ఒక రోజులో 2.5 కోట్ల టీకాలు వేయడం ద్వారా దేశం రికార్డు సృష్టించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా రికార్డును అందించడానికి ప్రభుత్వం పోటీ పడుతున్నందున శుక్రవారం తొలిసారిగా భారతదేశం ఒక రోజులో 2.5 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లను అధిగమించింది.
టీకా డ్రైవ్ వైద్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు అంకితం చేసిన మోడీ
సెప్టెంబర్ 17 న నిర్వహించే టీకాల సంఖ్య "ఆస్ట్రేలియా జనాభా" కు సమానమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో పేర్కొంది. చైనా ఒక రోజులో అత్యధికంగా 2.47 కోట్లు మందికి జూన్లో టీకాలు వేసింది. దేశంలోని వైద్యులు, వైద్య నిపుణులు, నిర్వాహకులు, నర్సులు, ఆరోగ్య సంరక్షణ మరియు ఫ్రంట్-లైన్ కార్మికులందరికీ టీకా డ్రైవ్ విజయాన్ని ప్రధాని మోదీ అంకితం చేశారు. నేటి రికార్డు టీకా సంఖ్యల గురించి ప్రతి భారతీయుడు గర్వపడతాడని, ఈ విజయాన్ని వైద్య రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్నానని, కరోనా మహమ్మారి ఓడించడానికి అందరూ టీకాలు తీసుకోవాలని పిఎం మోడీ ట్వీట్ చేశారు.