కరోనా వార్నింగ్: మాస్కు లేకుండా బయటికొస్తే రూ. 5వేల జరిమానా లేదా మూడేళ్ల జైలు, ఏ సిటీలోనంటే?
గాంధీనగర్: దేశంలో కరోనావైరస్ విస్తరిస్తున్న క్రమంలో పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. గుజరాత్ రాష్ట్రంలో కూడా కరోనా ఎక్కువగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నివారణ చర్యలకు ఉపక్రమించింది.
Recommended Video
5వేల జరిమానా లేదా మూడేళ్ల జైలు
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఇక్కడ మరింత కఠినంగా లాక్డౌన్ నిబంధనలను అమలు చేస్తున్నారు. నగరంలో ఇళ్ల నుంచి బయటికి వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించాలని.. లేని పక్షంలో రూ. రూ. 5000 జరిమానా చెల్లించాలని స్పష్టం చేశారు. జరిమానా లేకుంటే మూడేళ్ల శిక్ష విధిస్తామని అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా ఆదివారం తెలిపారు.
రేపట్నుంచి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాల్సిందే..
సోమవారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. అహ్మదాబాద్ నగర మున్సిపల్ పరిధిలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఇంటి నుంచి బయటికి వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు. లేదంటూ వారి నుంచి రూ. 5వేలు జరిమానా వసూలు చేస్తామని, జరిమానా కట్టలేని వారికి మూడేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రజలు మాస్కులు తువాలు, చేతిరుమాలు, బట్ట నుంచి చేసినదేదైనా ధరించవచ్చన్నారు.
అహ్మదాబాద్లోనే అత్యధిక కేసులు, మరణాలు
గుజరాత్ రాష్ట్రంలోనే అత్యధికంగా అహ్మదాబాద్ నగరంలో 266 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క ఈ నగరంలోని 11 కరోనా మరణాలు సంభవించాయి. మొత్తం గుజరాత్ రాష్ట్రంలో 22 మంది కరోనాతో మరణించగా.. 432 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఒడిశాలో కూడా మాస్కులు లేకుండా బయటకి వస్తే రూ. 200 జరిమానా విధిస్తున్నారు. ఇలా మూడుసార్లు ఉల్లంఘనలకు పాల్పడిన తర్వాత రూ. 500 జరిమానా వసూలు చేస్తున్నారు. కాగా, దేశంలో ఇప్పటి వరకు 8356 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 273కు చేరుకుంది. 716 మంది డిశ్చార్జ్ అయ్యారు.