కరోనా మాత ఆలయం ధ్వంసం-పోలీసుల పనే అంటున్న గ్రామస్తులు-అసలు కారణమదే?
ఉత్తరప్రదేశ్ ప్రతాప్గఢ్లోని జుహి శుక్లాపూర్లో నిర్మించిన 'కరోనా మాత' ఆలయాన్ని శుక్రవారం(జూన్ 11) రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నిర్మించిన నాలుగు రోజులకే ఆలయం ధ్వంసమైంది. ఇది ముమ్మాటికీ పోలీసుల పనే అని శుక్లాపూర్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. నిజానికి ఓ వివాదాస్పద స్థలంలో ఆ ఆలయాన్ని నిర్మించారని... ఆ వివాదంతో సంబంధం ఉన్న వ్యక్తులే ఆలయాన్ని కూల్చివేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
లోకేశ్ శ్రీవాస్తవ అనే ఓ వ్యక్తి స్థానికుల నుంచి చందాలు సేకరించి ఐదు రోజుల క్రితం శుక్లాపూర్లో 'కరోనా మాత' ఆలయాన్ని నిర్మించాడు. అందులో విగ్రహాన్ని ప్రతిష్ఠించి... రాధే శ్యామ్ వర్మ అనే వ్యక్తిని పూజారిగా నియమించారు. కరోనాను నిర్మూలించాలని నిత్యం అక్కడ పూజలు చేస్తూ ధూప ధీప నైవేద్యాలతో ఆరాధిస్తున్నారు.
ఆలయాన్ని నిర్మించిన లోకేశ్ శ్రీవాస్తవ ప్రస్తుతం నోయిడాలో ఉంటున్నాడు. కరోనా మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అతను నోయిడా వెళ్లిపోయాడు. ఆ ఆలయం నిర్మించిన స్థలం లోకేశ్ శ్రీవాస్తవతో పాటు నగేశ్ కుమార్ శ్రీవాస్తవ,జై ప్రకాశ్ శ్రీవాస్తవలకు చెందిన ఉమ్మడి ఆస్తి. లోకేశ్ నోయిడా వెళ్లిపోయాక.. నగేశ్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ స్థలాన్ని కబ్జా చేసేందుకే అక్కడ ఆలయం నిర్మించారని ఆరోపించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఊరి పొలిమేరల్లో మనకు గ్రామ దేవతల విగ్రహాలు కనిపిస్తుంటాయి. ప్రజలను చల్లగా చూడాలని,అంటు వ్యాధుల నుంచి,దుష్ట శక్తుల నుంచి తమను రక్షించాలని ప్రజలు గ్రామ దేవతలను ఆరాధిస్తారు. ఈ సంస్కృతి దేశవ్యాప్తంగా మనకు కనిపిస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా ఏకంగా ఓ వైరస్ పేరుతో విగ్రహాన్ని ప్రతిష్ఠించి... దేవతామూర్తులకు చేసినట్లే పూజలు,పునస్కారాలు నిర్వహించడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలకు ఇదో పరాకాష్ఠ అని అభిప్రాయపడేవారు లేకపోలేదు.