కరోనా సెకండ్ వేవ్: ఆక్సిజన్ సరఫరాలో మోదీ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది
దేశ రాజధాని దిల్లీ సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో లిక్విడ్ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. దీంతో, సీరియస్గా ఉన్న కరోనా రోగుపై ప్రభావం పడుతోంది.
దిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత వల్ల శుక్రవారం రాత్రి 20 మంది కోవిడ్ రోగులు చనిపోయారు.
ఎల్ఎన్జేపీ లాంటి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి సరోజ్, ఫోర్టిస్ లాంటి ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ కొరత కనిపిస్తోంది.
దిక్కుతోచని స్థితిలో ఉన్న కొన్ని ఆస్పత్రులు సాయం కోసం హైకోర్టు వైపు చూస్తున్నాయి.
పశ్చిమ మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ఉత్తరాదిన హరియాణా, మధ్య భారత్లో మధ్యప్రదేశ్ వరకూ మెడికల్ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది.
ఉత్తరప్రదేశ్లో కొన్ని ఆస్పత్రుల బయట 'ఆక్సిజన్ అవుటాఫ్ స్టాక్' అనే బోర్డులు పెట్టారు.
లఖ్నవూలోని ఆస్పత్రులు తమ వద్దకు వచ్చే రోగులను వేరే ఆస్పత్రులకు వెళ్లమని చెబుతున్నాయి.
దిల్లీలోని చిన్నా పెద్ద ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్ కూడా అదే చెబుతున్నాయి. చాలా నగరాల్లో రోగుల బంధువులు స్వయంగా సిలిండర్లు తీసుకుని రీ ఫిల్లింగ్ సెంటర్ల దగ్గర క్యూల్లో ఉండడం కనిపిస్తోంది.
హైదరాబాద్లోని ఒక ఆక్సిజన్ ప్లాంట్ బయట గుమిగూడిన జనాలను అదుపు చేయడానికి బౌన్సర్లను కూడా పిలిపించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇటీవల మహారాష్ట్ర నాసిక్లోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలో ట్యాంకర్ లీకై ఆక్సిజన్ అందక 22 మంది రోగులు చనిపోయారు.
వైద్యం కోసం ఎదురుచూస్తూ కరోనా రోగులు చనిపోతున్నారు. ఆస్పత్రుల్లో శ్వాస తీసుకోవడంలో తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్నవారికి వైద్యం చేయడానికి డాక్టర్లు రాత్రింబవళ్లూ శ్రమిస్తున్నారు.
బెడ్ దొరికినవారికి, ఆక్సిజన్ అందించడానికి ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆక్సిజన్ సిలిండర్ కావాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
అయినా, ఆక్సిజన్ కోసం ఇంత భయానక పరిస్థితి ఎందుకు ఏర్పడింది. ఆక్సిజన్ డిమాండ్ ఇంతలా ఎందుకు పెరిగింది.
చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత
కొన్నిరాష్ట్రాలు పరిస్థితిని అదుపు చేయగలిగాయి. మొదట ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచిన కేరళ తర్వాత దానిపై తీవ్రంగా దృష్టిపెట్టింది.
కేసులు పెరగుతుడడంతో ఆక్సిజన్ సరఫరాను పెంచాలనే పెంచాలని ప్రభుత్వం ముందే ప్రణాళికలు సిద్ధం చేసింది.
కేరళలోని ఆస్పత్రుల్లో ఇప్పుడు ఆక్సిజన్ కొరత లేదు. అది ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తోంది.
కానీ, దిల్లీ, మరికొన్ని రాష్ట్రాల్లో సొంత ఆక్సిజన్ ప్లాంట్లు లేవు. సరఫరా కోసం అవి మిగతా రాష్ట్రాలపై ఆధారపడ్డాయి.
మహారాష్ట్రలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. దేశంలోని కరోనా కేసుల్లో మూడింట ఒక వంతుకు పైగా ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 1200 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ మొత్తం ఆక్సిజన్ కరోనా రోగుల కోసమే ఉపయోగిస్తున్నారు.
కరోనా కేసులు పెరిగుతున్నకొద్దీ.. ఆక్సిజన్ డిమాండ్ కూడా పెరుగుతోంది. ఇప్పుడు ప్రతి రోజూ 1500 నుంచి 1600 టన్నుల ఆక్సిజన్ వినియోగిచే పరిస్థితి వచ్చింది. ఇది ఇప్పుడప్పుడే తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.
"సాధారణంగా మా దగ్గర ఆస్పత్రులకు తగినంత ఆక్సిజన్ దొరికేది. కానీ, గత 15 రోజులుగా రోగులకు శ్వాస అందించడం కష్టంగా ఉంది. 22 ఏళ్ల యువకులకు కూడా ఆక్సిజన్ సపోర్ట్ అవసరమవుతోంది" అని పుణెలో కోవిడ్ ఆస్పత్రి నిర్వహించే డాక్టర్ సిద్ధేశ్వర్ షిండే బీబీసీతో అన్నారు.
కరోనా కేసులు వేగంగా పెరగుతుండడం వల్ల, టెస్టులు, చికిత్స కోసం చాలామంది వేచిచూడాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. అవి ఆలస్యం కావడంతో, పరిస్థితి ఘోరంగా మారుతోందని, ఆస్పత్రుల్లో చేర్చాల్సిన పరిస్థితి వస్తోందని అంటున్నారు.
"పరిస్థితి తీవ్రంగా ఉండడంతో జనం భయపడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఫలితంగా హై-ఫ్లో ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతోంది. దాంతో, గత ఏడాది కంటే ఈసారీ దానిని ఎక్కువ సరఫరా చేయాల్సి వస్తోంది. ఇది ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలీడం లేదు. ప్రభుత్వం కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేదు" అని షిండే అంటున్నారు.
కేంద్ర-రాష్ట్రాల పరస్పర ఆరోపణలు
ఇతర రాష్ట్రాల నుంచి దిల్లీ వచ్చే ఆక్సిజన్ ట్రక్కులను అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తమకు తగినంత ఆక్సిజన్ ఇవ్వడం లేదని కూడా ఆయన అన్నారు.
https://twitter.com/ArvindKejriwal/status/1385141880661319683
దిల్లీ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత గరించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పందించారు.
దిల్లీ ప్రభుత్వం అడిగినదానికంటే ఎక్కువ కోటాను వాళ్లకు ఇచ్చామని, దానిని ఎలా ఇస్తారనేది వారే నిర్ణయించుకోవాలని ఆయన చెప్పారు.
సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్లో పర్యటించిన ఆరోగ్య మంత్రి ఈ మాట అన్నారని ఏఎన్ఐ చెప్పింది. పూర్తిగా కోవిడ్ సేవలు అందించే ఈ ఆస్పత్రి వచ్చే వారం నుంచి పనిచేస్తుంది.
"మేం దిల్లీకి ఇవ్వాల్సిన కోటాకంటే ఎక్కువ ఆక్సిజనే ఇచ్చాం. దానికి ఆయన ప్రధానికి ధన్యవాదాలు కూడా చెప్పారు. ఆ ఆక్సిజన్ను దానిని ఒక క్రమ పద్ధతిలో పంపిణీ చేయడానికి దిల్లీ ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించాలి" అన్నారు.
ఆక్సిజన్ రవాణాలో ఎలాంటి అంతరాయం ఉండదని, అంతరాయం సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన భరోసా ఇచ్చారు.
మరోవైపు, దిల్లీలోని ఆస్పత్రులు కూడా ఆక్సిజన్ కోసం దిల్లీ హైకోర్టుకు వెళ్లాయి. అక్కడ కూడా దిల్లీ ప్రభుత్వం ఇదే వాదనలు వినిపించింది.
దిల్లీ, మహారాష్ట్ర సహా మిగతా రాష్ట్రాల హైకోర్టులు కూడా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అక్షింతలు వేశాయి. పరిస్థితిని నియంత్రించాలని ఆదేశించాయి.
కేంద్ర, రాష్ట్ర అధికారులు లేదా స్థానిక అదికారులు ఎవరైనా ఆక్సిజన్ రవాణాకు అంతరాయం కలిగిస్తే ఉరి శిక్ష విధిస్తామని దిల్లీ హైకోర్ట్ శనివారం చెప్పింది.
కరోనా రోగుల ఆక్సిజన్ కొరతను దిల్లీలోని మహారాజా అగ్రసేన్ ఆస్పత్రి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినపుడు విచారణ చేపట్టిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
"మీరు దిల్లీకి రోజూ 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తామని ఏప్రిల్ 21న చెప్పారు అది ఎప్పుడవుతుంది" అని కేంద్రాన్ని ప్రశ్నించింది.
ఆక్సిజన్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది
లిక్విడ్ ఆక్సిజన్ తేలికపాటి నీలి రంగులో ఉండే వాయువు. చాలా చల్లగా ఉండే ఇది క్రయోజెనిక్ గ్యాస్. ఇది -183 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఉంటుంది. దీనిని ప్రత్యేక సిలిండర్లలో, ట్యాంకర్లలో నిల్వ చేస్తారు.
భారత్లో దాదాపు 500 పరిశ్రమలు గాలి నుంచి ఆక్సిజన్ తయారీ, శుద్ధి చేస్తున్నాయి. తర్వాత దానిని ద్రవ రూపంలోకి మార్చి ఆస్పత్రులకు పంపిస్తాయి. దీనిని ఎక్కువగా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.
ఆస్పత్రుల్లోని ఆక్సిజన్ ట్యాంకర్లలో దీనిని నింపి రోగుల పడకల వరకూ పైపుల ద్వారా సరఫరా చేస్తారు.
ప్రభుత్వం ఉత్పత్తి పెంచే ప్రయత్నం చేసిందా
దేశంలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత ఏడాది అక్టోబర్లో బిడ్స్ ఆహ్వానించింది.
అయితే భారత్లో కరోనా వచ్చి అప్పటికే 8 నెలలకు పైనే అయ్యింది.
ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామంటూ కేంద్రానికి ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయి. 162 సంస్థలకు కేంద్రం అనుమతులు కూడా ఇచ్చింది.
కానీ, ఇప్పటివరకూ 33 ప్లాంట్లు మాత్రమే ఏర్పాటయ్యాయని, ఏప్రిల్ చివరికల్లా 59 ప్లాంట్లు, మే చివరికి 80 ప్లాంట్లు సిద్ధమవుతాయని కేంద్రం చెబుతోంది.
ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది
దేశంలో ఆక్సిజన్ కొరత, వేగంగా పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా విదేశాల నుంచి మెడికల్ ఆక్సిజన్ దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.
మరో మూడు నెలలపాటు ఆక్సిజన్, దానికి సంబంధించిన పరికరాల దిగుమతులపై పన్ను మినహాయింపు ఇవ్వాలని కూడా కేంద్రం శనివారం నిర్ణయించింది.
మొత్తం 50 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ దిగుమతులకు కేంద్రం చర్యలు తీసుకుటోంది.
దేశంలోని తొమ్మిది పరిశ్రమలు మినహా మిగతావి ఆక్సిజన్ వినియోగించడంపై ప్రభుత్వ ఎంపవర్డ్ గ్రూప్-2నిషేధం విధించింది.
దీనితోపాటూ, 162 పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుచేయడానికి అవసరమైన నిధులు కూడా అందించింది.
https://twitter.com/PiyushGoyal/status/1385958689853505540
ఇక, వేగంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు కేంద్ర 'ఆక్సిజన్ ఎక్స్ప్రెస్' రైళ్లు కూడా నడుపుతోంది. ఖాళీ కంటైనర్లను త్వరగా ప్లాంట్ దగ్గరకు చేర్చడానికి వైమానిక దళం సాయం కూడా తీసుకుంటోంది.
ఆక్సిజన్ కాన్సంట్రేటర్
కొన్ని కేసుల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కూడా ఉపయోగిస్తున్నారు. ఈ మెషిన్ గాలి నుంచి ఆక్సిజన్ను తీసుకుని దానిని శుద్ధి చేసి రోగులకు అందిస్తుంది.
దీనిని ఉపయోగించడం సులభం, కానీ అది అందించే ఆక్సిజన్ కోవిడ్ రోగులకు సరిపోదని డాక్టర్లు చెబుతున్నారు.
అయితే దాని గురించి ఇంకా స్పష్టమైన సమాచారం ఏదీ లేదు.
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ద్వారా కోవిడ్ రోగులకు ఏదైనా సాయం ఉంటుందా, లేదా అనే అంశంపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ విభాగం పరిశోధనలు చేస్తోంది.
కానీ, ఒక విషయం మాత్రం స్పష్టం. కరోనా రోగులకు ఆక్సిజన్ మెషిన్తో ఇవ్వాలా, సిలిండర్తో ఇవ్వాలా అనేది డాక్టర్లు నిర్ణయిస్తారు.
ఆక్సిజన్ స్వచ్ఛత ఎక్కువగా ఉండడం వల్ల కూడా రిస్క్ పెరుగుతుందనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం అని డాక్టర్లు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- బానిసలుగా వచ్చి బాద్షాలయ్యారు
- తైవాన్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- తెలంగాణ బడ్జెట్ 2021: రూ.2,30,826 కోట్లతో బడ్జెట్.. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం
- నరేంద్ర మోదీ: ''తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
- కరోనావైరస్: మిగతా దేశాలు వ్యాక్సీన్ తయారు చేసుకోకుండా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయా?వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- నోబెల్కు 5 సార్లు నామినేట్ అయిన 'భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)