వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వైరస్: చైనాలాంటి పరిస్థితులు వస్తే భారత్ నెట్టుకురాగలదా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కరోనా

చైనాలోని పలు నగరాల్లో ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ఆస్పత్రుల బయట కిటకిటలాడుతూ జనం, మార్చురీ బయట పొడవైన క్యూల చిత్రాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

ఆ దేశంలో పెరుగుతున్న కరోనా కేసులకు కారణం ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఎఫ్.7 అని అంటున్నారు.

చైనాలో 2022 ఏప్రిల్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్యను డిసెంబర్ నెలలో దాటేసింది.

దాంతో, ప్రపంచమంతా అప్రమత్తమయింది. అనేక దేశాలు కోవిడ్ నిర్వహణకు సంబంధించిన చర్చలు మొదలుపెట్టాయి.

బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, అధికారులు, ఆరోగ్య నిపుణులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.

అందరూ అప్రమత్తంగా ఉండాలని, కరోనాపై నిఘాను పటిష్టం చేయాలని సూచించారు.

ప్రజలు మాస్క్ ధరించాలని, నిబంధనలను పాటించాలని కోవిడ్‌ జాతీయ టాస్క్‌ఫోర్స్ అధిపతి వీకే పాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే, దేశంలో పరిస్థితి అదుపులోనే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

గురువారం ప్రధాని మోదీ కూడా భారత్‌లో కరోనా పరిస్థితిపై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

కరోనా విషయంలో రాష్ట్రాలన్నీ పూర్తి అప్రమత్తతలో వ్యవహరించాలని, కోవిడ్‌ పరీక్షలను ముమ్మరం చేయాలని, ముఖ్యంగా విమానాశ్రయాల్లో నిఘా పెంచాలని సూచించారు.

జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ డాష్‌బోర్డ్ ప్రకారం, కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 66.72 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ సంఖ్య ఎంత పెద్దది అంటే, ప్రపంచ పటంలో దాదాపు 70 దేశాల జనాభా 66 లక్షల కంటే తక్కువ.

గత కొద్ది నెలలుగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ, ఈ నెలలో మళ్లీ వేగం పుంజుకున్నాయి.

ఇప్పుడు భారత్ ముందున్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్‌ల లాగ మరో కొత్త వేరియంట్ కూడా ఇక్కడ విజృంభిస్తుందా?

కోవిడ్ కొత్త వేవ్ వస్తే, దాన్ని ఎదుర్కోవడానికి భారత్ ఎంత సంసిద్ధంగా ఉంది?

వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరా, ఆస్పత్రులలో కోవిడ్ బెడ్‌లు, కోవిడ్ పరీక్షలు, హెల్ప్‌లైన్ వంటివి ఏ స్థితిలో ఉన్నాయి?

ఇంతకుముందు వచ్చిన కరోనా వేవ్స్ నుంచి భారతదేశం పాఠాలు నేర్చుకుందా లేదా?

వీటన్నింటి గురించి చర్చించే ముందు, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల ఎలా ఉందో చూద్దాం.

చైనాలో పరిస్థితి గందరగోళంగా ఉన్నట్టు ఫొటోలు, వీడియోల ద్వారా తెలుస్తోంది.

ఇది కాకుండా, జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, బ్రెజిల్‌లలో కూడా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ డాష్‌బోర్డ్ గణాంకాలు చూస్తే, గత వారం చైనాలో 244 మంది, అమెరికాలో 2,921 మంది, జపాన్‌లో 1,687 మంది కోవిడ్ ఇన్‌ఫెక్షన్ కారణంగా మరణించారు. ఈ దేశాలలో కోవిడ్ కేసులు మళ్లీ లక్షలకు చేరుకున్నాయి.

భారత్‌లో వ్యాక్సినేషన్ పరిస్థితి ఏమిటి?

ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసులు నాలుగు వేల కంటే తక్కువగా ఉన్నాయి. విమానాశ్రయాలలో ర్యాండమ్ టెస్టులు మొదలుపెట్టారు.

కోవిడ్ టీకాల విషయానికొస్తే, ప్రజలకు రెండు డోసుల టీకాలు అందించడంలో భారత ప్రభుత్వం విజయవంతమైందని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జుగల్ కిశోర్ అన్నారు.

"వ్యాక్సీన్‌తో సంక్రమణను ఆపలేకపోవచ్చుగానీ, వైరస్ తీవ్రతను, మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగాం" అని ఆయన అన్నారు.

కాగా, భారతదేశంలో సుమారు 220 కోట్ల వ్యాక్సీన్లను అందించారు.

మొదటి డోసు తీసుకున్నవారు సుమారు 102 కోట్లు ఉన్నారు. రెండవ డోసు తీసుకున్నవారు సుమారు 95 కోట్లు ఉన్నారు. అంటే సుమారు 7 కోట్ల మంది రెండో డోసు తీసుకోలేదు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశంలో 92 శాతం ప్రజలు రెండు డోసులూ తీసుకున్నారు. అయితే, వ్యాక్సీన్ విషయంలో కొన్ని రాష్ట్రాల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.

వీటిలో ఝార్ఖండ్ ముందుంది. ఆ రాష్ట్రంలో కేవలం 74 శాతం మాత్రమే రెండు డోసులూ తీసుకున్నారు.

ఈ జాబితాలో మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, చండీగఢ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి.

https://twitter.com/COVIDNewsByMIB/status/1605805922399444993

కొత్త వేరియంట్ కేసులెన్ని?

చైనాలో పెరుగుతున్న కరోనా కేసులకు కారణం ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఎఫ్.7 అని భావిస్తున్నారు. భారతదేశంలో ఈ కొత్త వేరియంట్ కేసులు నాలుగు బయటపడ్డాయి.

"ఇండియన్ sars-cov-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) ప్రకారం, భారతదేశంలో ఈ వేరియంట్‌తో నాలుగు కేసులు నమోదయ్యాయి.

ఈ సంవత్సరం జూలైలో ఒకటి, సెప్టెంబర్‌లో రెండు, నవంబర్‌లో ఒకటి బయటపడ్దాయి" అని డాక్టర్ వీకే పాల్ చెప్పారు.

కరోనా

బూస్టర్ డోస్ అవసరమా?

కొత్త వేరియంట్ వ్యాప్తిపై ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో, అందరూ బూస్టర్ డోసు వేయించుకోవాలని వీకే పాల్ కోరారు.

అయితే బూస్టర్ డోసు కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా ఎంత ప్రభావవంతంగా పని చేస్తుందన్న దానిపై సందేహాలు వెలువడుతున్నాయి.

అలాగే, ఎక్కువమంది బూస్టర్ డోసు ఎందుకు తీసుకోవడం లేదు అన్న ప్రశ్నా తలెత్తుతోంది.

కోవిడ్ వ్యాక్సీన్ మొదటి డోసు పొందినవారిలో కేవలం 23 శాతం మాత్రమే బూస్టర్ డోసు తీసుకున్నారని ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

అన్ని రాష్ట్రాలలోకల్లా మేఘాలయలో వ్యాక్సీన్ పరిస్థితి దారుణంగా ఉంది. మొదటి డోసు తీసుకున్నవారిలో కేవలం 8 శాతం మాత్రమే బూస్టర్ డోసు తీసుకున్నారు.

పంజాబ్, నాగాలాండ్, హరియాణా వంటి రాష్ట్రాలలో బూస్టర్ డోసు తీసుకున్నవారు 10 శాతం లోపే ఉన్నారు.

మరోవైపు, అండమాన్, నికోబార్ దీవులలో మొదటి డోసు తీసుకున్నవారిలో 82 శాతం బూస్టర్ డోసు తీసుకున్నారు.

లద్దాఖ్‌లో 62 శాతం, తెలంగాణలో 42 శాతం బూస్టర్ డోసు తీసుకున్నారు.

"బూస్టర్ డోస్‌తో ఇన్‌ఫెక్షన్‌ రేటు తగ్గినట్టు కనిపించలేదు. పరిశోధనలో కూడా ఇదే తేలింది. అందుకే ఎక్కువమంది ఆ డోసు వేయించుకోడానికి మొగ్గు చూపట్లేదు" అని డాక్టర్‌ జుగల్‌ కిశోర్‌ అన్నారు.

ఆస్పత్రుల సంసిద్ధత ఎంత?

దేశ రాజధానిలో సుమారు 20,000 కోవిడ్ పడకలు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం 30 పడకలపై మాత్రమే రోగులు ఉన్నారని దిల్లీ ప్రభుత్వం చెబుతోంది.

క్లిష్ట పరిస్థితులు ఎదురైతే పడకల సంఖ్యను రెట్టింపు చేయవచ్చని అంటున్నారు.

కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని, ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని జీటీబీ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ సుభాష్ గిరి బీబీసీతో చెప్పారు.

"ప్రస్తుతం జీటీబీలో కోవిడ్ కోసం దాదాపు 100 పడకలు ఉన్నాయి. అవి అన్నీ ఖాళీగా ఉన్నాయి. అవసరమైతే వెంటనే వీటిని 500కి పెంచగలం. కరోనా సెకడ్ వేవ్‌లో జీటీబీ హాస్పిటల్‌లో 750 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని 1200కి పెంచాం" అని ఆయన చెప్పారు.

దిల్లీ మాత్రమే కాదు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలు కూడా కోవిడ్‌ను ఎదుర్కోవటానికి ఆస్పత్రులలో కోవిడ్ పడకల సంఖ్యను పెంచాయి.

ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో సుమారు రెండు వేల ఆక్సిజన్ బెడ్‌లు, 800 ఐసీయూ పడకల సౌకర్యం ఉంది.

ఆక్సిజన్

ఆక్సిజన్ సప్లయి తగినంత ఉందా?

కరోనా రెండవ వేవ్‌లో, రేణు తన భర్తకు సీపీఆర్ చేస్తున్న చిత్రం దేశంలో ఆక్సిజన్ కొరత సృష్టించిన భయానక పరిస్థితికి చిహ్నంగా మారింది.

ఆస్పత్రులలో చేరిన రోగులు కూడా ఆక్సిజన్ అందక మృత్యువాత పడ్డారు. ఆక్సిజన్ కోసం రోడ్లపై క్యూలు కట్టారు. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ అంబులెన్స్‌లోనే ప్రాణాలు కోల్పోయినవారు ఎందరో.

అందుకే, అన్ని మెడికల్ కాలేజీలలో తప్పనిసరిగా ప్రెజర్ అబ్జార్ప్షన్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటులను ఏర్పాటు చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశించింది.

2022 జూలై 27న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో 4 వేల 115 ప్రెజర్ అబ్జార్ప్షన్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటులను ప్రారంభించారు.

వీటిలో వెయ్యి ప్లాంటులను గత ఏడాది అక్టోబర్‌లోనే ప్రారంభించారు.

దీనితోపాటు, కేంద్ర ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు, లక్షన్నర ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను కొనుగోలు చేసింది.

టెస్టింగ్ ఎలా జరుగుతోంది?

ప్రారంభంలో దేశంలో కోవిడ్ పరీక్షలకు కావలసిన మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన ఆర్‌టీ‌పీసీఆర్ టెస్ట్ ఫలితాలు రావడానికి చాలా రోజులు పట్టేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

ప్రస్తుతం దేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గుర్తింపు పొందిన 3,393 ల్యాబ్‌లు కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తున్నాయి.

"ఐసీఎంఆర్ ఏర్పాటు చేసిన కోవిడ్ ఆర్‌టీ‌పీసీఆర్ నెట్‌వర్క్ దాదాపు పూర్తయింది. మేం బార్‌కోడ్ ద్వారా జనరేట్ అయిన రిపోర్టులు తయారుచేస్తున్నాం. రోగులు ఐసీఎంఆర్ ఐడీ ఉపయోగించి ఆన్‌లైన్‌లో వివరాలు పొందవచ్చు" అని ఇన్‌స్టిట్యూట్ ‌ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ హాస్పిటల్ ల్యాబ్‌లో క్లినికల్ వైరాలజీ నిపుణురాలు డాక్టర్ ఏక్తా గుప్తా చెప్పారు.

ప్రస్తుతం భారతదేశం ఒక నెలలో సుమారు 5 కోట్ల కోవిడ్ పరీక్షలను చేయగలదు. దేశంలో ఇప్పటివరకు 90 కోట్ల కోవిడ్ పరీక్షలు జరిగాయి.

కోవిడ్ పరీక్షలు

కొత్త వేరియెంట్‌లపై నిఘా

కొత్త వేరియంట్, సబ్‌వేరియంట్‌లను గుర్తించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను ల్యాబ్‌లకు పంపాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది.

కొత్త కోవిడ్ వేరియంట్‌లను గుర్తించడానికి భారతదేశంలో ఇండియన్ సార్స్-కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం ఏర్పడింది.

ఇందులో భాగంగా, కోవిడ్ వైరస్‌లో వచ్చే జన్యు వైవిధ్యాన్ని పరిశీలించడానికి దేశవ్యాప్తంగా 54 ప్రయోగశాలలు కలిసి పనిచేస్తున్నాయి.

"దిల్లీలోని ప్రతి పాజిటివ్ కోవిడ్ కేసుకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని మాకు చెప్పారు. కొత్త వేరియంట్‌లను గుర్తించడానికి ర్యాండమ్ శాంపిల్స్ కూడా సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నాం. వాటిలో ఏదీ కొత్తగా కనిపించలేదు" అని డాక్టర్ ఏక్తా గుప్తా చెప్పారు.

చైనా, జపాన్‌ల మాదిరి భారత్‌లో కేసులు అంతకంతకూ పెరగట్లేదుగానీ, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Corona virus: Can India face if China-like situation comes?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X