ఏపీతోపాటు ఈ 12 రాష్ట్రాల్లోనే లక్షకుపైగా కరోనా యాక్టివ్ కేసులు: బెంగళూరులో కల్లోలం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి.. మరింతగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలోని 12 రాష్ట్రాల్లో లక్ష చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్రలో స్వల్పంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండగా.. బెంగళూరు, చెన్నై నగరాల్లో కరోనా కేసులు భారీగా పెరగడం ఆందోళన కలగిస్తోందన్నారు.

నెల రోజుల్లో 472 శాతం పెరిగిన కరోనా కేసులు
బుధవారం లవ్ అగర్వాల్ కరోనా పరిస్థితిపై మీడియాతో మాట్లాడారు. గత ఒక్క నెలరోజుల్లోనే (ఏప్రిల్ 4 నుంచి) 7.37 లక్షల నుంచి 34.85 లక్షలకు యాక్టివ్ కేసులు పెరిగిపోయాయని తెలిపారు. ఆందోళనకరంగా 472 శాతం పెరుగుదల నమోదైందన్నారు. భారీగా పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు ఆరోగ్య వ్యవస్థకు భారంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వైద్య వ్యవస్థపై పెనుభారంగా కరోనా యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి పెరుగుతున్నాయి. రోజువారీ కరోనా కేసుల్లో 2.4 శాతం పెరుగుదల నమోదవుతోంది. చెన్నైలో కరోనా కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టకపోతే.. వైద్య సేవల నిర్వహణ మరింత కష్టతరమవుతోందని అన్నారు.
మహారాష్ట్ర తర్వాత కర్ణాటక, ఏపీ, ఢిల్లీ, హర్యానాలో ఎక్కువ కరోనా మరణాలు నమోదవుతున్నాయన్నారు.

బెంగళూరులో కరోనా కల్లోలం..
గత వారం రోజుల్లో ఒక్క బెంగళూరు నగరంలోనే 1.49 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళ కలిగిస్తోందన్నారు. బెంగళూరులో పాజిటివిటీ రేటు 50 శాతం కన్నా ఎక్కువగా ఉందన్నారు. కర్ణాటకలో ఈరోజు 50వేల కరోనా కొత్త కేసులు నమోదు కాగా, అందులో సగం బెంగళూరు నగరం నుంచే ఉండటం గమనార్హం. చెన్నైలో ఈ సంఖ్య 38వేలుగా ఉందన్నారు. కోజికోడ్, ఎర్నాకుళం, గురుగ్రామ్ జిల్లాల్లోనూ కరోనా కేసులు పెరుగుదల గణనీయంగా ఉందన్నారు.

ఈ 12 రాష్ట్రాల్లో లక్షకుపైగా కరోనా యాక్టివ్ కేసులు
ఇక మే 1 నుంచి వ్యాక్సినేషన్ పాలసీని కేంద్రం సవరించిందని లవ్ అగర్వాల్ తెలిపారు. ఇందులో భాగంగా 9 రాష్ట్రాల్లో 6.17 లక్షల మంది 18-44 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు వ్యాక్సిన్ తీసుకున్నారని చెప్పారు. 12 రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. ఏడు రాష్ట్రాల్లో 50వేల నుంచి లక్ష యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో 1.5 లక్షలకుపైగా యాక్టివ్ కేసులుండటం ఆందోళన కలిగిస్తోందని వ్యాకఖ్యానించారు.
లక్షకుపైగా కరోనా యాక్టివ్ కేసులున్న రాష్ట్రాలివే..
మహారాష్ట్రలో 6.41 లక్షల కరోనా యాక్టివ్ కేసులు
కర్ణాటకలో 4.64 లక్షల కరోనా యాక్టివ్ కేసులు
కేరళలో 3.56 లక్షల కరోనా యాక్టివ్ కేసులు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2.72 లక్షల కరోనా యాక్టివ్ కేసులు
రాజస్థాన్ రాష్ట్రంలో 1.97 లక్షల కరోనా యాక్టివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.59 లక్షల కరోనా యాక్టివ్ కేసులు
గుజరాత్ రాష్ట్రంలో 1.48 లక్షల కరోనా యాక్టివ్ కేసులు
తమిళనాడులో 1.25 లక్షల కరోనా యాక్టివ్ కేసులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 1.24 లక్షల కరోనా యాక్టివ్ కేసులు
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 1.21 లక్షల కరోనా యాక్టివ్ కేసులు
బీహార్ రాష్ట్రంలో 1.10 లక్షల కరోనా యాక్టివ్ కేసులు
హర్యానాలో 1.08 లక్షల కరోనా యాక్టివ్ కేసులు
ఢిల్లీలో లక్ష కరోనా యాక్టివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications