కరోనావైరస్: 80 లక్షల మంది పీఎఫ్ డబ్బులు తీసేశారు.. మీపై దీని ప్రభావమేంటి
భారత దేశంలో గత మూడు నెలల్లో 80 లక్షల మంది తమ భవిష్య నిధి(ప్రావిడెంట్ ఫండ్) హుండీని పగలగొట్టి తమ డబ్బులు వెనక్కు తీసుకున్నారు.
హుండీ అని నేను ఊరికే అనడం లేదు. మట్టితో చేసిన హుండీ పగలగొట్టకుండా డబ్బులు ఎలా తీసుకోలేమో.. పీఎఫ్ నుంచి డబ్బులు వెనక్కు తీసుకోవడం కూడా అంత సులభం కాదు.
మనిషి సంపాదనకు అన్ని దారులూ మూసుకుపోయినా, దీని భరోసాతో తర్వాత జీవితం కొనసాగించగలిగేలా ఈ ఫండ్ను ఏర్పాటు చేశారు.
అందుకే ప్రావిడెంట్ ఫండ్ నుంచి డబ్బులు తిరిగి తీసుకోవాలంటే నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఉద్యోగంలో ఉంటూనే, దానిలోంచి డబ్బులు తీసుకోవడం చాలా కష్టం.
కానీ, కరోనా మహమ్మారితో ఎదురవుతున్న ఆర్థిక కష్టాల నుంచి ఉపశమనం అందించడానికి ప్రభుత్వం మొట్టమొదట తీసుకున్న పెద్ద చర్యల్లో, పీఎఫ్ డబ్బులు సులభంగా తిరిగి తీసుకునే సౌకర్యం కల్పించడం ఒకటి.
ఉద్యోగాల్లో లేనివారికి పీఎఫ్ డబ్బు కొన్నిరోజుల తర్వాత అందుతుంది. కానీ అప్పటికీ విధుల్లో ఉన్నవారు ఏదైనా సమస్యల్లో చిక్కుకుపోయినపుడు ఇది ఒక లైఫ్లైన్లా ఉండేది.
అయితే, అప్పుడూ, ఇప్పుడూ నా అభిప్రాయం ఒకటే. సాధ్యమైనంతవరకూ మీరు మీ పీఎఫ్ మొత్తాన్ని తీయకపోవడం మంచిది.
కానీ, ఇప్పుడు వెలుగులోకి వస్తున్న గణాంకాలను చూస్తుంటే దాదాపు 30 లక్షల మంది, బహుశా తమకు ఇక ఏ దారీ లేని స్థితికి చేరుకున్నట్టు అనిపిస్తోంది.
- కరోనావైరస్: భారత్లో కోవిడ్ సామాజిక వ్యాప్తి లేదా? అధికారులు ఎందుకలా చెబుతున్నారు?
- గ్రామాల్లో కరోనా వైరస్ విజృంభణ.. తెలుగు రాష్ట్రాల్లో సామాజిక వ్యాప్తికి ఇది సంకేతమా
30 వేల కోట్ల రూపాయల క్లియరెన్స్
వార్తాపత్రికల్లో ఈపీఎఫ్ఓను ఉంటికిస్తూ ప్రచురించిన వార్తల ప్రకారం ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో మొత్తం దాదాపు 80 లక్షల మంది 30 వేల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని తమ పీఎఫ్ ఖాతాల నుంచి తీసేసుకున్నారని తెలుస్తోంది.
ముఖ్యంగా నెలకు 15 వేల రూపాయలు సంపాదించేవారికి ఈ కష్టకాలంలో పీఎఫ్ ఒక పెద్ద ఉపశమనంగా నిలిచింది. ఆ మొత్తంతో వారు కొన్ని నెలలు గడిపేయవచ్చు.
తర్వాత బతికుంటే, ఉద్యోగం ఉంటే భవిష్యత్తు గురించి ఆలోచించచ్చులే అనుకున్నారు. ఎవరి ఖాతాల నుంచి వారు డబ్బులు తీసుకున్నారు.
ఐఏఎస్ అధికారి అనిల్ స్వరూప్ కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్గా పనిచేసినప్పుడు పీఎఫ్ లెక్కలను ఆన్లైన్ చేసే పనులను ప్రారంభించారు.
ఆయన వల్లే ఈరోజు పీఎఫ్ నుంచి మన డబ్బును చిటికెలో తీసుకోగలుగుతున్నాం. అంతకుముందు రిటైరైన వారు పీఎఫ్ ఆఫీసుల చుట్టూ కొన్ని నెలలు, సంవత్సరాలు చక్కర్లు కొట్టేవారు.
“కరోనా సంక్షోభం మొదలవగానే అవసరమైనవారు కొంత డబ్బు తీసుకోడానికి మినహాయింపులు ఇవ్వడం చాలా మంచి నిర్ణయం. దీని తర్వాత ఏం చేయచ్చో కూడా వారు సలహాలు ఇచ్చారు.
ప్రభుత్వం బ్యాంకు ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లుపై మారటోరియం లేదా మినహాయింపులు ఇచ్చినట్లే, పీఎఫ్ నుంచి కూడా మినహాయింపులు ఇవ్వాలని సూచించారు” అని అనిల్ స్వరూప్ చెప్పారు.
మూడొంతుల మంది చిరుద్యోగులేఒక ఉద్యోగి వేతనం నుంచి 12 శాతం పీఎఫ్ కట్ అయితే, 12 శాతం వారి సంస్థ నుంచి లభిస్తుంది. ఈ రెండు మొత్తాలనూ కొన్ని నెలల వరకూ వేతనంతోపాటూ ఉద్యోగి చేతికి ఇవ్వడమో లేదంటే బ్యాంక్ అకౌంట్లో వేయడమో చేయాలని ప్రభుత్వం సూచించింది.జనం ఆ మొత్తాన్ని ఖర్చు చేయడం వల్ల దేశానికి చాలా ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుత సమయంలో ఎకానమీని తిరిగి పట్టాలెక్కించడానికి జనం ఖర్చు చేయడం చాలా అవసరం. ద్రవ్యోల్బణం పెరగకుండా వ్యాపారాలు వేగవంతం చేయడానికి ముందున్న ఏకైక మార్గం ఇదే. అది కూడా త్వరగా జరుగుతుంది.కోవిడ్ సమయంలో పీఎఫ్ నగదు ఉపసంహరణ నిబంధనలు సడలించడం వల్ల ఖాతా నుంచి డబ్బులు తీసుకున్న వారంతా తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేశారని నిపుణులు భావిస్తున్నారు.
వారిలో చాలా మంది, ముఖ్యంగా నెలకు 15 వేల కంటే తక్కువ సంపాదించేవారు.. వారంతా పీఎఫ్ నుంచి తీసుకున్న డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు.
డీపీఎఫ్ఓ జూన్లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం పీఎఫ్ తీసుకున్నవారిలో 74 శాతం మంది నెలకు 15 వేల కంటే తక్కువ సంపాదించే వారే ఉన్నారు. నెలకు 50 వేలకు పైగా సంపాదించేవారు ఈ జాబితాలో 2 శాతమే ఉన్నారు.
మీ జేబుపై ఎలాంటి ప్రభావం ఉంటుందికానీ, కోవిడ్ వెసులుబాటు కింద కాకుండా, సాధారణ విధానంలో పీఎఫ్ నుంచి డబ్బులు తీసుకున్నవారి గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో పీఎఫ్ నుంచి డబ్బులు తీసుకున్నవారి సంఖ్య కోటి వరకూ ఉంటుందని పీఎఫ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కోటిన్నర మంది పీఎఫ్ నుంచి రూ. 72 వేల కోట్లు తీసుకున్నారు.
తర్వాత ఈ ఏడాది మూడు నెలల్లోనే కోటి మంది పీఎఫ్ డబ్బు కోసం దరఖాస్తులు పెట్టారు. వీరిలో ఎక్కువ మంది తాము డబ్బులు తీసుకోడానికి వైద్య చికిత్సలను కారణాలుగా చూపించారు. పీఎఫ్ డబ్బు తీసుకోడానికి వైద్య చికిత్సలు, పెళ్లి, కుటుంబ సభ్యుల మరణం లేదా ఇల్లు కట్టుకోవడం లాంటి కొన్ని కారణాలు చెబుతారనే విషయం అందరికీ తెలిసిందే.
దరఖాస్తులో వైద్య చికిత్సలు అని రాసినంత మాత్రాన, ఆ డబ్బును వారు దానికే ఉపయోగించాలని లేదు.అలాంటప్పుడు, వైద్యానికి కాకపోతే డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్న వస్తుంది.
అయితే ఇప్పుడు కాలెండర్ మీద ఒక కన్నేద్దాం. జూన్లో లాక్డౌన్ సడలించడం, జనాలు తిరిగి పనుల్లోకి రావడం మొదలైంది. కానీ జూన్ చివరి మూడు వారాల్లో ప్రతి రోజూ సుమారు లక్ష మంది తమ పీఎఫ్ డబ్బులు తీసేస్తూ వచ్చారు.కొందరు సగం తీసుకుంటే, కొందరు పూర్తిగా తీసేశారు. దీనికి కారణం ఒకటే అనుకోవచ్చు. 15 నుంచి 20 లక్షల మంది ప్రస్తుతం తాము కష్టాల్లో ఉన్నామని భావిస్తున్నారు. కొందరికి ఉద్యోగం పోతే, కొందరికి జీతాల్లో కోత పడింది. లేదంటే కొందరు కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగం వదిలేయడమే మంచిదని అనుకున్నారు.
(రచయిత సీఎన్బీసీ ఆవాజ్ మాజీ ఎడిటర్. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం)
ఇవి కూడా చదవండి:
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- అంతరిక్షం నుంచి అందరికీ ఇంటర్నెట్.. కొత్త ఉద్యోగాలు వస్తాయ్
- ఇంటర్నెట్లో అమ్మభాషనే కోరుకుంటున్న 92 శాతం తెలుగువారు: గూగుల్ అధ్యయనంలో వెల్లడి
- శృంగారం సాంకేతిక అభివృద్ధికి ఎలా దోహదపడింది...
- ప్రాణాలు కాపాడిన వీడియోకాల్
- డార్క్ వెబ్: డ్రగ్స్, గన్స్.. అన్నీ డోర్ డెలివరీ!
- పల్లెపల్లెకూ బ్రాడ్బ్యాండ్: మోదీ ప్రభుత్వం ఏంచెప్పింది? ఏం సాధించింది?
- నెట్ సరే.. న్యూట్రాలిటీ సంగతేంటి?
- పోర్న్ వెబ్సైట్లపై ప్రభుత్వం పట్టు బిగించగలదా?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్స్టర్' ఎలా అయ్యాడు?
- తెలంగాణలో నియంత్రిత సాగుపై రైతులు ఏమంటున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)