Coronavirus: 83 జిల్లాల్లో లాక్ డౌన్, ప్రధాని తీవ్ర అసంతృప్తి, రోడ్లలో మీటింగ్ లు !
న్యూఢిల్లీ/బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న కరోనా వైరస్ ను (COVID-19) అరికట్టడానికి దేశ వ్యాప్తంగా 83 జిల్లాల్లో మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ అమలుపై ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్షం చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీటర్ వేదిక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్ డౌన్స్ ఎందుకు ప్రకటించామో ప్రతి ఒక్కరూ గుర్తించాలని, లాక్ డైన్స్ పై నిర్లక్షం పనికిరాదని, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ కు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ లో మనవి చేశారు. బెంగళూరు నగరంలో ఏకంగా గార్మెంట్స్ ఫ్యాక్టరీలు, పలు సంస్థల కార్యాలయాలు తెరచి పనులు ప్రారంభించడంతో ఆరోగ్య శాఖ, సంబంధిత అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Coronavirus: దుబాయ్ టూ బెంగళూరు, 6 మందికి కరోనా వైరస్, 195 మందిలో, మొత్తం 21!
హోటల్స్, టీ స్టాల్స్ లో మీటింగ్స్ !
దేశంలోని అనేక నగరాలు, పట్టణాల్లో ఎప్పటిలాగే హోటల్స్, టీ షాపులు, స్వీట్ స్టాల్స్, చిన్నచిన్న షాపులతో పాటు చిరు తిండ్లు విక్రయించే షాపుల్లో సోమవారం ఉదయం నుంచి వ్యాపారాలు జరుగుతున్నాయి. టీ షాప్ లు, హోటల్స్ లో ఎక్కువ మంది గుమికూడటంతో పాటు ఆహారం ఆరగించారు. కొందరు టీలు తాగుతూ అక్కడే చక్కగా సిగరెట్లు తాగుతూ, ఉప్పర మీటింగ్ లు వేస్తూ దర్శనం ఇచ్చారు. లాక్ డౌన్ ఆదేశాలు ఉన్నా చాలా మంది మాత్రం ఆ ఆదేశాలను గాలికి వదిలేసి వ్యాపారాలు చేస్తున్నారు.
అవునా ?, మాకు ఇంకా చెప్పలేదు !
కరోనా వైరస్ మహ్మరిని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని 83 జిల్లాల్లో లాక్ డౌన్ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన కొన్ని రాష్ట్రాల్లోని ఆయా జిల్లాల్లో ఎప్పటిలాగే వ్యాపారలావాదేవీలు జరుగుతున్నాయి. ఇది ఏమిటని కొందరు ప్రశ్నించినప్పుడు మాకు స్థానిక అధికారుల నుంచి అధికారికంగా ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని షాప్ లు యజమానులు సమాధానం ఇస్తున్నారు.
నిన్న ఎడారి, నేడు మాత్రం రద్దీ రోడ్లు
కరోనా వైరస్ వ్యాధిని పూర్తిగా అరికట్టడంలో భాగంగా ఆదివారం దేశ వ్యాప్తంగా నిర్వహించిన జనతా కర్ఫ్యూ పూర్తిగా విజయవంతం అయ్యింది. ఆదివారం దేశ వ్యాప్తంగా ప్రధాన రహదారులు, హైవేలు, నగరాలు, పట్టణాల్లోని రహదారులు ఎడారిని తలపించాయి. అయితే సోమవారం ఉదయం నుంచి అదే రహదారులు రద్దీగా దర్శనం ఇస్తున్నాయి ఎప్పటిలాగా కాకుండా కొంచెం తక్కువగా అయినా జనసంచారంతో పలు ప్రాంతాలు రద్దీగా ఉన్నాయి.
బెంగళూరులో గాలికి వదిలేసి !
ఐటీ, బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలో మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ విధించారు. అయితే బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో ఎప్పటిలాగే సోమవారం హోటల్స్, స్వీట్ స్టాల్స్, టీ షాపులు, చిన్నచిన్న దుకాణాలు తీసి వ్యాపారాలు చేస్తున్నారు. బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో గార్మెంట్స్ ప్యాక్టరీలు పనులు ప్రారంభించడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు చోట్ల గార్మెంట్స్, ఫ్యాక్టరీలు, పలు సంస్థలను మూసివేయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని, మార్చి 31వ తేదీ వరకు ఎవ్వరూ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా చూస్తామని అధికారులు అంటున్నారు.
అత్యవసర సేవలు ఓకే
సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా కిరాణా దుకాణాలు, బేకరీలు, హాస్పిటల్స్, మెడికల్ స్టోర్స్, పెట్రోల్ బంకులు, పాలు, పండ్లు, కూరగాయలతో పాటు ప్రజలకు అసరవమైన నిత్యవసర వస్తువులు విక్రయించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని లాక్ డౌన్ ఉత్తర్వులు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే పలు జిల్లాల్లో రద్దీని నివారించడానికి 144 సెక్షన్ విధించారు. 144 సెక్షన్ నియమాలు ఉల్లంఘిస్తున్న ప్రజలు ఎప్పటిలాగే గుంపులు గుంపులుగా నిలబడి ఉప్పర మీటింగ్ లు వేస్తూ దర్శనం ఇస్తున్నారు. కరోనా వైరస్ ను అరికట్టడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు కచ్చితంగా అమలు చేస్తామని, ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు.