మనదేశంలో కరోనా మరణాల రేటు చాలా తక్కువ అందుకే: పోరాటం ఆగదు
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో కరోనా మహమ్మారి మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతేగాక, కరోనా బారిన పడి కోలుకునే వారి సంఖ్య పెరిగిందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వివరాలను వెల్లడించారు.

అందుకే కరోనా మరణాలు తక్కువ..
ప్రపంచ వ్యాప్తంగా మరణాల రేటు 6.4 శాతంగా ఉండగా, భారతదేశంలో మాత్రం అది 2.8 శాతంగా ఉందని అగర్వాల్ వెల్లడించారు. లాక్డౌన్ విధించడం, వెంటనే కేసులు గుర్తించి కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయడం వల్ల మరణాల సంఖ్యను అదుపులో ఉంచగలిగామని ఆయన వివరించారు.

కరోనాపై పోరాటం పూర్తి కాలేదు..
లాక్డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్కులు తప్పక ధరించాలని సూచించారు. అలాగే కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనన్నారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ ను కట్టడి చేయగలిగామని, అయితే ఆ మహమ్మారిపై పోరాటం మాత్రం పూర్తి కాలేదని స్పష్టం చేశారు.

సడలింపులతో పెరుగుతున్న కేసులు..
గడిచిన 24 గంటల్లో దేశంలో 6535 కేసులు నమోదు కాగా, మంగళవారం నాటికి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,45,380కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 60,490 మంది కోలుకున్నారు. 4167 మంది మరణించారు. లాక్ డౌన్ సడలింపులు, వలస కార్మికుల రాకపోకలతో పలు రాష్ట్రాల్లో మరింతగా కరోనా కేసులు పెరుగుతుండటం కొంత ఆందోళన కలిగించే అంశంగా మారింది.
Recommended Video

ఈ రాష్ట్రాల్లోనే అత్యధికంగా..
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రంలో 52,667 కేసులు నమోదు కాగా, తమిళనాడులో 17,728, గుజరాత్ రాష్ట్రంలో 14,468, ఢిల్లీలో 14,465, రాజస్థాన్ 7476, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ 6497, పశ్చిమబెంగాల్లో 4009 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 1695 మరణాలు సంభవించాయి.












Click it and Unblock the Notifications