కరోనా జాగ్రత్తలు: ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకంపై కేంద్రం కీలక మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తి కట్టడి కోసం దేశ వ్యాప్తంగా మే 3 వరకు ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ 20 తర్వాత నుంచి కేంద్రం పలు సడలింపులను, మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏసీలు, కూలర్ల ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటం కీలక మార్గదర్శకాలను వెల్లడించింది.
ఏసీలు, కూలర్ల కారణంగా కరోనా..
ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం మరింత పెరగనుంది. అయితే కరోనా వైరస్ ఏసీలు, కూలర్ల కారణంగా మరింత వ్యాప్తి చెందుతుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనర్ ఇంజినీర్స్ రూపొందించిన ఈ మార్గదర్శకాలు కేంద్రం విడుదల చేసింది.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఓకే..
కేంద్రం మార్గదర్శకాల ప్రకారం.. ఇళ్లలో ఏసీల వాడకంలో గది ఉష్ణోగ్రతను 24 నుంచి 30 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉండేలా చూసుకోవాలి. సంబంధిత తేమ శాతం 40 నుంచి 70 మధ్య ఉంటే మేలని సూచించింది. వ్యాధికారక క్రిముల వ్యాప్తి నివారణకు ఇవి సరైన ఉష్ణోగ్రతలని వివరించింది. తేమ వాతావరణంలో ఏసీని 24 డిగ్రీల సెంటిగ్రేడ్ కు దగ్గరగా సెట్ చేయాలి. పొడి వాతావరణంలో 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండేలా జాగ్రత్త పడాలి. గది నలుమూలలకు గాలి ప్రసరించేందుకు ఫ్యాన్లు వాడొచ్చు. పొడి వాతావరణం నెలకొని ఉంటే సంబంధిత తేమ శాతాన్ని 40 శాతం కంటే తక్కువ ఉంచరాదు.
వాటిని నిరోధించాలంటే..
ఏసీలు ఆన్లో ఉన్నప్పుడు రూమ్ కిటికీలు పాక్షికంగా తెరిచి ఉంచాలి. ఏసీ గాలి అక్కడే పరిభ్రమించకుండా, సహజసిద్ధమైన రీతిలో శుభ్రపడుతుంది. ఏసీలు వాడుతున్నప్పుడు బయటి నుంచి వచ్చేగాలి తాజాగా ఉండాలంటే కిచెన్, టాయిలెట్లలో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఆన్ చేసి ఉంచాలి. తద్వారా బయటి నుంచి దుమ్ము, ధూళితో కూడిన గాలిని నిరోధించవచ్చు.
Recommended Video
కూలర్లు, ఫ్యాన్లు కూడా..
కూలర్లు పరిశుభ్రమైన గాలి ప్రసరించాలంటే ఎవాపరేటివ్ కూలర్లు గాలిని బయటి నుంచి స్వీకరించేలా ఉండాలి. ఎవాపరేటివ్ కూలర్లలో నీటి ట్యాంకులను శుభ్రపరచాలి. క్రిమినాశని రసాయనాలతో శుద్ధి చేయాలి. ఒకసారి వాడిన నీటిని తొలగించేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలి. కూలర్ల నుంచి వచ్చే తేమతో కూడిన గాలిని బయటికి పంపేందుకు కిటికీలు తెరిచే ఉంచాలి. పోర్టబుల్ ఎవాపరేటివ్ కూలర్లు బయటి నుంచి గాలిని స్వీకరించే ఏర్పాట్లు కలిగి వుండవు కనుక.. ఆ తరహా కూలర్ల వాడకం నిలిపివేయాలి. ఫ్యాన్లు తిరిగే సమయంలో గది కిటికీలు పాక్షికంగా తెరిచి ఉంచాలి. సాధారణ ఫ్యాన్లు తిరిగే సమయంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఆన్లో ఉండే మేలని పేర్కొంది. మెరుగైన రీతిలో గదిలోని గాలి ఎప్పటికప్పుడు శుభ్రపడే అవకాశం ఉంటుంది. కాగా, దేశంలో ఇప్పటి వరకు 26,267 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 825 మరణాలు చోటు చేసుకున్నాయి.