Coronavirus: కరోనాతో 65% ఆలస్యంగా వచ్చి 55% మృతి, బెంగళూరుకు జులై చీకటి రోజులు, పరిస్థితి !
బెంగళూరు/ న్యూఢిల్లీ: ఐటీ, బీటీ సంస్థల దేశరాజధాని సిలికాన్ సిటీ బెంగళూరులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. బెంగళూరు సిటీలో కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ సోకిన 65 శాతం మంది ఆలస్యంగా ఆసుపత్రికి రావడంతో వచ్చిన 24 గంటల్లోనే 55 % మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని వైద్యులు స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాధి చికిత్స పొందుతూ చికిత్స విఫలమై 10 శాతం మంద మాత్రమే చనిపోతున్నారని, ఆలస్యంగా ఆసుపత్రులకు రావడం వలనే బెంగళూరులో ఎక్కువ మంది చనిపోతున్నారని వైద్యులు నిర్దారించారు. బెంగళూరుకు జులై నెలలో 860 మంది కరోనాకు బలి కావడంతో చీకటి రోజులు మిగిల్చాయి. ఐటీ, బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన బెంగళూరు ప్రజలు ఈ విషయం తెలుసుకుని హడలిపోతున్నారు.
Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో !
జులై 1 నుంచి జులై 28 వరకు ఇదే జరిగింది
కరోనా వైరస్ కు సంబంధించిన బులెటిన్లను కర్ణాటక ప్రభుత్వం ప్రతిరోజు విడుదల చేస్తోంది. కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన కరోనా వైరస్ బులిటెన్లలో బెంగళూరు పూర్తి సమాచారం ఉంది. జులై 1వ తేదీ నుంచి జులై 28వ తేదీ వరకు బెంగళూరులో కరోనా వైరస్ వ్యాధితో 860 మంది చనిపోయారు. వీరిలో 497 మంది అంటే 55 శాతం మంది ఆసుపత్రిలో చేరిన 24 గంటల్లోపు చనిపోయారు. 94 మంది అంటే 10 శాతం మంది చికిత్స పొందుతూ చికిత్స విఫలమై మరణించారు.
కరోనా రోగులు ఇలా వస్తున్నారు
కర్ణాటక కరోనా డెత్ ఆడిట్ ప్యానల్ సభ్యుడు, సీనియర్ వైద్యుడు అయిన డాక్టర్ కేఎస్. సతీష్ తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరులో కరోనా వైరస్ వ్యాధి సోకిన రోగులు చాలా ఆలస్యంగా ఆసుపత్రులకు వస్తున్నారని, వారికి చికిత్స అందించడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే చనిపోతున్నారని, ఎక్కువ శాతం మంది 24 గంటల్లోపు చనిపోయారని చెప్పారని డాక్టర్ సతీష్ చెప్పారని ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది.
12 గంటల్లో 50 మంది !
బెంగళూరులో 12 గంటల్లో ఆసపత్రుల్లో చేరిన 50 మంది, మూడు గంటల్లోపు 5 మంది ప్రాణాలు విడిచారని డాక్టర్ కేఎస్. సతీష్ వివరించారు. బెంగళూరులో కరోనా వైరస్ సోకిన వారు ఆలస్యంగా ఆసుపత్రులకు రావడం వలనే మరణాలు ఎక్కువ జరుగుతున్నాయని, ఇదో పెద్ద సమస్యగా మారిందని డాక్టర్ కేఎస్, సతీష్ వివరించారు. ఇక ఐసీయూలో చికిత్స పొందుతూ 70 శాతం మంది చికిత్స విఫలమై మరణించారని బెంగళూరులోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి అయిన రాజీవ్ గాంధీ ఇన్సిట్యూట్ ఆఫ్ చెస్ట్ డిసీజెస్ డైరెక్టర్, కర్ణాటక డెత్ ప్యానెల్ కమిటీ సభ్యుడైన డాక్టర్ నాగరాజు అంటున్నారు.
విక్టోరియాలో ఇదే పరిస్థితి
బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ కు అనుబంధంగా ఉన్న విక్టోరియా ఆసుపత్రిలో ఇదే పరిస్థితి ఉందని వెలుగు చూసింది. జులై 15వ తేదీ వరకు విక్టోరియా ఆసుపత్రిలో నమోదైన 91 కరోనా మరణాల్లో ఆసుపత్రిలో చేరిన 24 గంటల్లోనే 39 మంది చనిపోయారని ఆ ఆసుపత్రి COVID -19 కోర్ కమిటీ నోడల్ అధికారి డాక్టర్ స్మితా సెగు అంటున్నారు. ఆసుపత్రులకు వచ్చిన తరువాత ఐసీయూల్లో చికిత్స పొందుతూ చాలా తక్కువ మంది చనిపోతున్నారని, సమయానికి ఆసుపత్రులకు రాకపోవడం వలనే చాలా మంది కరోనా వైరస్ వ్యాధినపడి మరణిస్తున్నారని డాక్టర్ స్మితా సెగు అంటున్నారు.
ఐసీయూలు 100 మాత్రమే ఉన్నాయి
కరోనా రోగులకు చికిత్స చెయ్యడానికి కేవలం 100 ఐసీయూ పడకలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయని, 500 ఐసీయూ పడకలు అవసరం అవుతాయని పలువురు డాక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారని ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ దిన పత్రిక కథనం ప్రచురించింది. ఐసీయూలు ఎక్కువ అవసరం కావడంతో ప్రభుత్వం ప్రస్తుతం ప్రయివేట్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసిందని ప్రభుత్వ డాక్టర్లు అంటున్నారు.
Recommended Video
బెంగళూరుకు జులై చీకటి రోజులు
బెంగళూరులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన మార్చి నెల నుంచి జులై 28వ తేదీ వరకు సిలికాన్ సిటీలో 957 మంది ఆ మహమ్మారి వ్యాధికి బలి అయ్యారు. అయితే ఒక్క జులై నెలలో మాత్రమే బెంగళూరులో కరోనా వైరస్ వ్యాధితో 860 మంది చనిపోయారని ప్రభుత్వ బులెటిన్లు స్పష్టం చేశాయి. బెంగళూరు సిటీలో మొత్తం 48, 821 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో ఒక్క జులై నెలలో మాత్రమే 44, 266 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. బెంగళూరులో ఇప్పటికీ 35, 102 కరోనా ఆక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు అంటున్నారు. మొత్తం మీద జులై నెల బెంగళూరు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసిందని వెలుగు చూసింది.