కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్: శ్రీలంకలో చిక్కుకున్న 2వేల మంది భారతీయులు
న్యూఢిల్లీ: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులు తిరిగి స్వదేశం రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలు దేశాల్లోని భారతీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
అయితే, లాక్ డౌన్ కారణంగా పక్కనే ఉన్న శ్రీలంక దేశంలో 2వేల మంది భారతీయులు చిక్కుకుపోయారు. కాగా, శ్రీలంకలో మొత్తం 16,900 మంది విదేశీయుల్లో 2,439 మంది చైనీయులే ఉన్నారని శ్రీలంక పర్యాటకం, అభివృద్ధి శాఖ వెల్లడించింది. తమ దేశంలోని ఇతర దేశీయులను తీసుకెళ్లేందుకు ఏ దేశం నుంచి వచ్చిన చార్టర్ విమానాలనైనా అనుమతిస్తామని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా నేపథ్యంలో గత వారం నుంచి శ్రీలంక దేశం కూడా అంతర్జాతీయ విమానాల రాకపోకలను రద్దు చేసింది. అంతేగాక, విదేశీ పర్యటనలకు వెళ్లకూడదని తమ దేశీయులకు సూచించింది. కొన్ని పరిమిత సంఖ్యలో మాత్రమే విమానాలు నడుస్తున్నాయి.
కాగా, శ్రీలంకలో ఇప్పటి వరకు 104 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 200 మంది వరకు అనుమానితులను పర్యవేక్షణలో ఉంచారు. శ్రీలంకలో నమోదైన తొలి కరోనా కేసు చైనాకు చెందిన మహిళా పర్యాటకురాలే కావడం గమనార్హం. ఆమెకు నయం కావడంతో మార్చి తొలివారంలో ఆమెను చైనాకు పంపేశారు. ఆ తర్వాత ఇటలీ పర్యాటకుడిగా గైడ్ గా ఉన్న శ్రీలంక వ్యక్తికి కూడా కరోనా సోకింది. అతనికి కూడా నయమైంది. పర్యాటకంతోనే ఆదాయం పొందే శ్రీలంకలో కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 5,31,860 ఉండగా.. 25వేల మరణాలు చోటు చేసుకున్నాయి. అమెరికాలోనే అత్యధికంగా 85,653 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటలీ, చైనా కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు అమెరికాలోనే నమోదవడం గమనార్హం.