కరోనా విలయం:ఈ రాత్రి 8గంటలకు బీరెడీ.. లాక్డౌన్పై తేల్చనున్న ప్రధాని మోదీ ..జాతినుద్దేశించి సందేశం.
భారత్లో కరోనా విలయం ఎంత భయానకంగా కొనసాగుతోందంటే.. మరి కొద్ది గంటల్లోనే మనం చైనాను అధిగమించే దుస్థితికి చేరుకున్నాం. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 3,604 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 70,756కు పెరిగింది. అత్యధిక రికవరీ రేటుతో ఇప్పటికే 22,454 మంది వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ, గడిచిన మూడ్రోజులుగా కొత్త కేసులు వెల్లువలా వస్తుండటం ఇబ్బందికర పరిణామంలా మారింది. ఆదివారం కూడా 4వేల పైచిలుకు కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా మన దగ్గర కరోనా మరణాలు 2,293కు చేరుకున్నాయి. వైరస్ వ్యాప్తి ఇంకా పీక్ దశకు రాలేదని నిపుణులు చెబుతున్నారు. దీంతో లాక్ డౌన్ పొడగింపు తప్పదనే భావన వ్యక్తమవుతోంది. ఈ దశలో దేశప్రజలకు కీలక సందేశం ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు.
Recommended Video
ఇవాళ రాత్రి 8 గంటలకు..
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం ప్రకటించిన మూడో దశ లాక్ డౌన్ ఈనెల 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ప్రధాని మోదీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మధ్యాహ్నం నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు సాగిన కాన్ఫరెన్స్ లో అధినేతలంతా కీలక నిర్ణయానికి వచ్చారు. అదే విషయాన్ని మోదీ.. ప్రజలతో పంచుకోనున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం, కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
సుదీర్ఘ లాక్ డౌన్..
ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్ లో ముగింపు ఉపన్యాసం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు, సూచనలు సంచలనంగా మారాయి. రాబోయే కాలంలో మనమంతా కరోనాతో కలిసి జీవించడానికి సిద్ధపడాలంటూనే.. వైరస్ పూర్తిస్థాయిలో కట్టడి అయ్యేదాకా అవసరమైతే సుదీర్ఘ లాక్ డౌన్ తప్పదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఎకానమిక్ యాక్టివిటీలు పున:ప్రారంభమయ్యేందుకు కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని, అందులో భాగంగానే నాలుగో దశ లాక్ డౌన్ లో భారీ ఎత్తున సడలింపులు ప్రకటిస్తామని ముఖ్యమంత్రులతో ప్రధాని అన్నారు. కంటైన్మెంట్ జోన్లను ఆంక్షలను కఠినతరం చేస్తూనే.. నాన్ కంటైన్మెంట్ జోన్లలో అన్ని రకాల వ్యాపారాలు రీఓపెన్ చేయిద్దామని చెప్పారు.
సీఎంల ఆగ్రహం.. వెనక్కి తగ్గిన కేంద్రం..
ఇవాళ రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.. ప్రధానంగా లాక్ డౌన్ ఎగ్జిట్ పైనే మాట్లాడుతారని కేంద్ర వర్గాలు తెలిపాయి. సోమవారం నాటి సీఎంల భేటీలో.. మొదట లాక్ డౌన్ ఎత్తేదామంటూ మోదీ హింట్ ఇచ్చినా, మెజార్టీ రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడం, అసలు లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేయాలి, ఏ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ఉంచాలనే నిర్ణయాధికారం రాష్ట్రాల చేతుల్లోనే ఉండాలని పలువురు ముఖ్యమంత్రులు వాదించారు. ఆర్థిక సహాయం విషయంలో కేంద్రం తీరు బాగాలేదని ఇంకొందరు ముఖ్యమంత్రులు ఆగ్రహించారు. మొత్తంగా సీఎంల డిమాండ్ మేరకు లాక్ డౌన్ పొడగింపునకే సంసిద్ధులైనట్లు వార్తలు వచ్చాయి.
ప్యాకేజీ కూడానా?
లాక్ డౌన్ అమలులోకి వచ్చి 50 రోజుగు గడుస్తున్నా, పేదలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆదుకునే చర్యలు చేపట్టలేదనేది మోదీ సర్కారుపై ప్రధాన విమర్శ. కరోనా తొలినాళ్లలో ప్రకటించిన రూ.1.75లక్షల కోట్ల ప్యాకేజీ ఏమూలకు సరిపోలేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. దీంతో అన్ని రంగాఅను అంతోఇంతో ఆదుకుంటూ, ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనం చేకూరేలా కేంద్రం మరో కొత్త ప్యాకేజీని సిద్ధం చేసింది. స్వయంగా ప్రధాని మోదీ పర్యవేక్షణలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్యాకేజీని రూపొందించినట్లు తెలసింది. మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడే సందర్భంలోనే ప్రధాని ప్యాకేజీ ప్రకటన కూడా చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, బుధవారం కేబినెట్ ఆమోదం తర్వాతే దాన్ని ప్రకటిస్తారని మరో వాదన కూడా ఉంది.
ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయి..
ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో బీజేపీ ముఖ్యమంత్రులందరూ కేంద్రం ఏం చెబితే అది వింటామని స్పష్టంచేయగా, కాంగ్రెస్, నాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో చాలా మంది లాక్ డౌన్ పొడగింపువైపే మొగ్గుచూపారు. అదేసమయంలో ఎకానమీ రీఓపెనింగ్ నిర్ణయాధికారం రాష్ట్రాల చేతుల్లోనే ఉండాలని పట్టుపట్టారు. దీంతో ఏయే వ్యాపారాలు తెరిచేందుకు సిద్ధంగా ఉన్నారో రిపోర్టులు రెడీ చేసి ఈనెల 15లోగా వాటిని కేంద్రానికి పంపాలని ప్రధాని కోరారు. కాగా, కరోనా కట్టడికి కేవలం లాక్డౌన్ ఒక్కటే పరిష్కార మార్గం కాదని, హెల్త్ సేఫ్టీ పాటిస్తూనే ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలను రీస్టార్ట్ చేయాల్సిన అవసరముందని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం సూచించారు.