Coronavirus: ప్రపంచానికే రోల్ మోడల్ మైసూరు, నో కరోనా, ప్రధాని మోదీ కంటే ముందే లాక్ డౌన్ !
బెంగళూరు/ మైసూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా 215 దేశాల్లో 3 లక్షల మందికి పైగా కరోనా వైరస్ వ్యాధితో మరణించారు. భారతదేశంలో ఇప్పటి వరకు 2,752 మంది కరోనా వైరస్ కాటుకు బలి అయ్యారు. కర్ణాటకలోని రాచనగర మైసూరు నగరం నేడు ప్రపంచం దృష్టిలో పడింది. ప్రపంచ దేశాలకు ఈ రోజు మైసూరు నగరం రోల్ మోడల్ గా నిలిచింది. మైసూరు జిల్లాలో 90కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో, అందరికి వ్యాధి నయం చెయ్యడం, ఈ రోజు ఒక్క కరోనా పాజిటివ్ ఆక్టీవ్ కేసు లేకుండా చూడటం ఒక్క మైసూరు జిల్లాకే చెందింది. ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశం మొత్తం లాక్ డౌన్ విధించక వారం రోజుల ముందే మైసూరులో లాక్ డౌన్ అమలు చేసి నేడు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది.
Recommended Video
Lockdown: ప్రధాని మోదీపై దుష్ప్రచారం, మేకప్ ఎలా చేశారో చూడండి ?, చీప్ ట్రిక్స్, ఎవరో తెలిస్తే !
జ్యుబిలియంట్ ఫ్యాక్టరీ దెబ్బ
మైసూరు జిల్లాలో మొదట కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు అయ్యింది నంజనగూడులోని జ్యుబిలియంట్ ఫ్యాక్టరిలో ఉద్యోగికి. జ్యుబిలియంట్ ఫ్యాక్టరీ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చిందని వెలుగు చూడటంతో మైసూరు, చామరాజనగర జిల్లాల్లోని ప్రజలు ఆందోళనకు గురైనారు. విషయం తెలుసుకున్న జ్యుబిలియంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు చేస్తున్న మొత్తం వెయ్యి మంది ఎక్కడికి కదలకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఉద్యోగులకు క్వారంటైన్
జ్యుబిలియంట్ ఫ్యాక్టరీ ఉద్యోగుల్లో 74 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ లింక్ తో 8 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురు, వీరితో టచ్ లో ఉన్న మరో ఐదు మందికి, మొత్తం 90 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు గుర్తించారు. మొదట జ్యుబిలియంట్ ఫ్యాక్టరీలో పని చేస్తూ కరోనా పాజిటివ్ వచ్చిన 74 మందిని ఐసోలేషన్ కు తరలించారు. మిగిలిన జ్యుబిలియంట్ ఫ్యాక్టరీ ఉద్యోగులు అందరినీ హోమ్ క్వారంటైన్ కు పరిమితం చేశారు.
90 మంది తబ్లీగి జమాత్, ఉద్యోగులకు చెక్
జ్యుబిలియంట్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఎవ్వరినీ కలవకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక తబ్లీగి జమాత్ సభ్యులు సైతం వేరే వ్యక్తులను కలవకుండా అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన జ్యుబిలియంట్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, తబ్లీగి జమాత్ సభ్యులు ఎవ్వరినీ కలవకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో మైసూరు నగరంతో పాటు ఆ జిల్లాలో కరోనా వైరస్ వ్యాపించకుండా కట్టడి చెయ్యడానికి అవకాశం వచ్చింది.
ప్రధాని మోదీ కంటే ముందే లాక్ డౌన్
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి భారతదేశంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా కట్టడిలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 21వ తేదీన జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. తరువాత మార్చి 25వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. అయితే మైసూరు జిల్లాలో మార్చి 15వ తేదీన లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. ప్రపంచంలోనే మైసూరుకు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. మార్చి 15వ తేదీ నుంచి మైసూరుకు పర్యాటకులు ఎవ్వరూ రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. మైసూరు అంతర్జాతీయ జంతు ప్రదర్శనశాలను ఆ రోజు నుంచి పూర్తిగా మూసివేయాలని జిల్లాధికారి అభిరాం జి. శంకర్ ఆదేశాలు జారీ చేశారు.
అంతరాష్ట్ర సరిహద్దులు బంద్
మార్చి 15 వ తేదీ నుంచి మైసూరు నగరంతో పాటు ఆ జిల్లాలోకి పొరుగున ఉన్న తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఎవ్వరూ రాకుండా అంతరాష్ట్ర సరిహద్దులు పూర్తిగా మూసివేశారు. ముఖ్యంగా కేరళ నుంచి ఒక్కరు కూడా మైసూరు జిల్లాలో అడుగుపెట్టకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాధికారి అభిరామ్ జి. శంకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 15వ తేదీ నుంచి కట్టడి చెయ్యడంతో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి మైసూరు జిల్లాలో మరింత కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చెయ్యడానికి అవకాశం వచ్చిందని మైసూరు జిల్లాధికారి అభిరామ్ జి. శంకర్ తెలిపారు.
వలస కూలీలకు సహాయం
మార్చి 15వ తేదీ నుంచి వలస కూలీలు, కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అధికారులు అనేక చర్యలు తీసుకున్నారు. వలస కూలీలు, కార్మికులకు నిత్యవసర వస్తువులు, ప్రతిరోజు ఆహారం అందించడంలో స్థానిక నాయకులు, స్వచ్చంద సంస్థలు, అధికారుల సహాయం తీసుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడటంలో జిల్లాధికారి అభిరామ్ జి. శంకర్ పూర్తిగా విజయం సాధించారు. మైసూరు జిల్లాలో మొత్తం 90 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అందరికీ మెరుగైన చికిత్స అందించి వ్యాధి నయం చేసి వారిని ఇళ్లకు పంపించారు. మైసూరు జిల్లాలో ఈ రోజు ఒక్క కరోనా పాజిటివ్ ఆక్టివ్ కేసు కూడా లేకపోవడంతో దేశానికే, ప్రపంచానికి మైసూరు జిల్లా ఆదర్శంగా నిలిచింది.