అంతర్జాతీయ విమానాల రద్దు, వర్క్ ఫ్రం హోం: కేంద్రం కీలక మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనావైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ, వాణిజ్య విమానాలను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 22 నుంచి వారంపాటు అంతర్జాతీయ, వాణిజ్య విమానాలకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కీలక సూచనలు, మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ సహా ఉన్నతాధికారులు ఈ మేరకు మీడియాకు వివరించారు. 65ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్లలోపు పిల్లలను ఇంటి నుంచి బయటకు రానివ్వొద్దని సూచించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య సిబ్బందికి మాత్రం మినహాయింపు ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వ గ్రూప్ బీ, సీ కేటగిరీల ఉద్యోగులు వారం విడిచి వారం విధులకు రావాలని కేంద్రం సూచించినట్లు తెలిపారు. వారానికొకసారి ఈ విధానం మార్చుకోవాలని, బీ, సీ కేటగిరీలో ఉద్యోగులు మినహా మిగిలిన ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేసేలా ఆయా విభాగాధిపతులు ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు.
కార్యాలయానికి దగ్గరలో నివాసం ఉంటున్న అన్ని స్థాయిల ఉద్యోగులను గుర్తించి వారు ఎప్పుడంటే అప్పుడు కార్యాలయాలకు వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు.
ఇక ప్రైవేటు ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా రాష్ట్రాలకు కేంద్రం సూచించిందని తెలిపారు. అత్యవసర సర్వీసుల్లో పనిచేసే వారు మినహా మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సంస్థల ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేలా కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. దివ్యాంగులు, విద్యార్థులు, రోగులు మినహా మిగిలిన అన్ని రాయితీ పాస్ లను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రద్దు చేయాలని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. కాగా, దేశంలో ఇప్పటి వరకు 172 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. నాలుగు కరోనా మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.












Click it and Unblock the Notifications