coronavirus: వైద్యులు దేవుళ్లు, గౌరవంగా మెలగండి, వారణాసి వాసులతో వీడియో కాన్ఫరెన్స్లో మోడీ
కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తర్వాత తన నియోజకవర్గ ప్రజలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఇంటరాక్ట్ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానికులతో ముచ్చటించారు. వారణాసి ఎంపీగా మీ ఆలనా పాలనా తెలసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తాను ఢిల్లీలో బిజీగా ఉన్నప్పటికీ.. వారణాసిలో ఏం జరుగుతుందో తన సహచరుల ద్వారా సమాచారం తెలుసుకుంటానని పేర్కొన్నారు.

నవరాత్రులు..
వైరస్పై పోరాడేందుకు ఆ దేవుడు తనకు మరంత బలం ఇవ్వాలని కోరుకుంటున్నానని వీడియో కాన్ఫరెన్స్లో మోడీ చెప్పారు. మనకు ఇవాళ (బుధవారం)తో నవరాత్రి ప్రారంభమవుతోందని చెప్పారు. మనమంతా ఆ దేవదేవుడికి ప్రత్యేక ప్రార్థనాలు చేయాలని కోరారు. అలాగే 9 రోజులు పేదలను ఆదుకోవాలని మోడీ పిలుపునిచ్చారు. ఆపత్కాల సమయంలో వారణాసి ప్రజలు దేశానికి మార్గదర్శనం కావాలని మోడీ పేర్కొన్నారు. దేశంలో శాంతి, సహనం, కరుణ గురించి ఇతరులకు వివరించాలని కోరారు. కరోనా వైరస్కు మందు సామాజిక దూరం పాటించడమేనని పేర్కొన్నారు.

రూమర్లు నమ్మొద్దు..
కరోనా వైరస్పై ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రధాని మోడీ సూచించారు. వైరస్ గురించి వస్తోన్న రూమర్లను మాత్రం విశ్వసించొద్దని సూచించారు. వైరస్ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతుందని.. ప్రజలు యోగా, ఇతర ఎక్సర్సైజ్ చేయాలని ప్రజలకు సూచించారు. కరోనా వైరస్ లక్ష మందికి సోకిందని.. వారంతా కోలుకున్నారని పేర్కొన్నారు. వైరస్ గురించి వాట్సాప్లో హెల్ప్ డెస్క్ కూడా ప్రారంభించబోతున్నామని తెలిపారు. 9013151515కు నమస్తే అని హిందీ, ఇంగ్లిషులో రాయాలని సూచించారు.

వైద్యులకు వందనం
రోగులకు వైద్యం అందిస్తోన్న వైద్యుల పట్ల గౌరవ, మర్యాదలు చూపాలని మోడీ పిలుపునిచ్చారు. ఆపత్కాల సమయంలో రోగులకు వైద్యం అందజేస్తోన్న వారి పట్ల వినయం చూపాలని.. వైట్ కోట్ వేసుకొన్న వైద్యులు ఇప్పుడు ప్రజల పాలిట దేవుడు అని తెలిపారు. ప్రజలను కాపాడేందుకు వారి ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. కానీ వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం మంచిది కాదని మోడీ అభిప్రాయపడ్డారు.

సొంత వైద్యం వద్దు..
ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రజలు తమ చిత్తశుద్ది, నిబద్ధతను చాటారాని మోడీ పేర్కొన్నారు. కర్ఫ్యూ తర్వాత వైద్యులు, నర్సులకు చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలిపారని పేర్కొన్నారు. వైరస్ లక్షణాలు ఉంటే వైద్యులను సంపద్రించాలని కోరారు. సొంత వైద్యం మంచిది కాదని సూచించారు.












Click it and Unblock the Notifications