కరోనావైరస్: మే 14-18 మధ్య కోవిడ్ విశ్వరూపం... శాస్త్రవేత్తల అంచనా - ప్రెస్ రివ్యూ

ఆస్పత్రిలో కరోనా రోగి

మే మూడో వారంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పినట్లు ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

భారత్‌లో హడలెత్తిస్తున్న కరోనా రెండో ఉద్ధృతికి సంబంధించి తమ అంచనాలను ఐఐటీ శాస్త్రవేత్తలు తాజాగా సవరించారు.

మే నెల 14-18 మధ్య ఈ మహమ్మారి ఉద్ధృతి పతాక స్థాయికి చేరుకోవచ్చని వారు తెలిపారు.

ఆ సమయంలో దేశంలో క్రియాశీల కొవిడ్‌-19 కేసులు 38-48 లక్షల మధ్య ఉండొచ్చని చెప్పారు.

మే నెల 4-8 మధ్య రోజువారీ ఇన్‌ఫెక్షన్ల సంఖ్య అత్యధికంగా 4.4 లక్షలకు చేరుకోవచ్చని విశ్లేషించారు.

'ససెప్టబుల్‌, అన్‌డిటెక్టడ్‌, టెస్ట్‌డ్‌ (పాజిటివ్‌), అండ్‌ రిమూవ్డ్‌ అప్రోచ్‌' (సూత్రా) అనే గణిత నమూనా ఆధారంగా కాన్పుర్‌, హైదరాబాద్‌లోని ఐఐటీ శాస్త్రవేత్తలు ఈ అంచనాలు వేశారు.

గత వారం కూడా వీరు కొన్ని విశ్లేషణలు చేశారు. మే 11-15 మధ్య ఈ మహమ్మారి గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని, ఆ సమయంలో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 33-35 లక్షల మేర ఉండొచ్చని ఆ అంచనాల్లో చెప్పారు.

మే నెలాఖరుకు కేసులు గణనీయంగా తగ్గొచ్చని కూడా నాడు తెలిపారు. ఏప్రిల్‌ 15 నాటికి భారత్‌లో క్రియాశీల కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని ఈ నెల మొదట్లో వారు చేసిన అంచనాలు తప్పాయి.

ఇప్పుడు కొన్ని సవరణలు చేశారు. ''ఈ దఫా అంచనాలకు సంబంధించి కనిష్ఠ, గరిష్ఠ వివరాలనూ లెక్కించాం. అందువల్ల మేం ఊహించిన శ్రేణిలోనే వాస్తవ విలువలు ఉంటాయని కొంతవరకూ ధీమాగా చెప్పగలను'' అని అధ్యయనంలో పాల్గొన్న మణిందర్‌ అగర్వాల్‌ చెప్పారు.

భారత్‌లో ప్రస్తుత దశకు సంబంధించిన వివిధ పరామితుల విలువల్లో నిరంతరం మార్పులు జరగడం వల్లే అంచనాలను సవరించాల్సి వస్తోందని ఆయన చెప్పారని ఈనాడు వివరించింది.

మద్రాస్ హైకోర్ట్

ఈసీపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం

మీ వల్లే ఇంతలా కొవిడ్‌ వ్యాపించిందని మద్రాస్ హైకోర్టు ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

నిన్న కలకత్తా హైకోర్టు..ఇప్పుడు మద్రాస్‌ హైకోర్టు! ఎన్నికల సంఘంపై నిప్పులు కక్కాయి.

కొవిడ్‌ విజృంభిస్తున్న వేళ జరుగుతున్న ఎన్నికలకోసం ఈసీ తీసుకొంటున్న చర్యలతీరుని మద్రాస్‌ హైకోర్టు తూర్పారబట్టింది.

'మీ మీద మర్డర్‌ కేసు పెడితే సరిపోతుంది' అంటూ ఎన్నికల అధికారులను ఉద్దేశించి అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

''ఇక్కడా, దేశంలోనూ కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రబలడానికి మీరే కారణం'' అంటూ తీవ్ర స్వరం వినిపించింది. అత్యంత బాధ్యతారహిత సంస్థ అంటూ ఈసీకి చీవాట్లు పెట్టింది.

ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం విచారణ సందర్భంగా మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ బెనర్జీ, జస్టిస్‌ సెంథిల్‌కుమార్‌ రామమూర్తిలతో కూడిన ప్రథమ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

తమిళనాడులో ఈ నెల ఆరోతేదీన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు మే రెండోతేదీన ప్రకటించనున్నారు.

అయితే, ఈ ఫలితాల విడుదలలో పారదర్శకత, కొవిడ్‌ జాగ్రత్తతు పాటించేలా అధికారులను ఆదేశించాలంటూ రవాణాశాఖ మంత్రి ఎమ్‌ఆర్‌ విజయభాస్కర్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారని ఆంధ్రజ్యోతి వివరించింది.

ప్రతి పల్లెకూ ఇంటర్నెట్

వర్క్ ఫ్రం హోమ్ కోసం ఏపీలో ప్రతి పల్లెకూ ఇంటర్నెట్

రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ సీఎం చెప్పారని సాక్షి దినపత్రిక కథనం ప్రచురించిదిం.

ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ ఏర్పాటు, అమ్మఒడి పథకంలో భాగంగా ఆప్షన్‌గా ఇవ్వాల్సిన ల్యాప్‌టాప్‌లపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేశారు.

అన్ని గ్రామాలకు అపరిమితంగా ఇంటర్నెట్‌ కనెక్షన్స్‌ ఉండాలని, సీఎంఏ స్పీడ్‌ కనెక్షన్‌ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని సీఎం జగన్‌ అన్నారు.

అన్ని గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీలు ఉండాలని చెప్పారు. స్వగ్రామంలోనే వర్క్‌ ఫ్రం హోం సదుపాయం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లోనూ ఇంటర్నెట్‌ కనెక్షన్లు ఉండాలని తెలిపారు. నిర్ణీత వ్యవధిలోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.

అమ్మఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌లు కోరుకున్నవారందరికీ జనవరి 9వ తేదీన అందించాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

ల్యాప్‌టాప్‌లతో పాటు గ్యారెంటీ, వారంటీ కార్డులివ్వాలని తెలిపారు. ల్యాప్‌టాప్‌ చెడిపోతే సర్వీస్‌ సెంటర్‌కు పంపి వారంలో తిరిగి ఇవ్వాలని ఆదేశించారు.

ఇప్పటివరకు 307 మండలాల్లోని 3,642 గ్రామాల్లో 14,671 కిలో మీటర్ల మేర ఏరియల్‌ కేబుల్‌ వేసినట్లు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్‌ సీఎంకు వివరించారు.

మరోవైపు 690 చదరపు అడుగుల విస్తీర్ణంతో వైఎస్సార్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలు నిర్మిస్తున్నట్లు, ఒక్కో లైబ్రరీకి రూ.16 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. ప్రతి లైబ్రరీలో 20 సీట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారని సాక్షి వివరించింది.

కరోనాతో చనిపోయిన జర్నలిస్టు కుటుంబానికి 2 లక్షలు

తెలంగాణలో కరోనాతో చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి ప్రభుత్వం రూ.2 లక్షల తక్షణ సాయం అందించనున్నట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.

కరోనా బారినపడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది.

మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.2 లక్షల చొప్పున అందించి ఆదుకోనున్నది.

మరోవైపు వైరస్‌ బారినపడిన జర్నలిస్టులకు తక్షణ ఆర్థిక సహాయం అందించనున్నది. ఈ విషయాన్ని మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ వెల్లడించారు.

మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబసభ్యులు మే 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరణ ధృవీకరణ పత్రం, అక్రెడిటేషన్‌ కార్డు, కరోనా పాజిటివ్‌ రిపోర్టులతోపాటు ఆయా జిల్లాల డీపీఆర్వోలు ధృవీకరించాల్సి ఉంటుందని తెలిపారు.

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్రంలో పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.

పదిరోజుల వ్యవధిలోనే 15 మంది జర్నలిస్టులు మృతిచెందడంపై ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా బారినపడిన 200 మంది జర్నలిస్టులకు తక్షణ ఆర్థికసాయం చేస్తున్నట్టు ప్రకటించారు.

విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధిత జర్నలిస్టులకు పూర్తిగా అండగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారమందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించి ప్రత్యేకంగా కరోనా పరీక్షా కేంద్రాలు, దవాఖానల్లో ప్రత్యేక వైద్యసదుపాయాలు కల్పించాలని, పాత్రికేయులందరికీ ప్రత్యేకంగా టీకా కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.

వైరస్‌ బారినపడిన బాధితులు, మృతుల కుటుంబసభ్యులు ఆర్థికసాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆయా జర్నలిస్టు సంఘాలు బాధితులకు సహకరించాలని విజ్ఞప్తిచేశారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+