ఉత్తర ప్రదేశ్లో ఏం జరుగుతోంది: ప్రారంభ ఫలితాల్లో అనూహ్యంగా
న్యూఢిల్లీ: ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ వస్తోన్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవ్వాళ వెలువడనున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం ఇంకొన్ని గంటల్లో బహిర్గతం కానుంది. ఈ అయిదింట్లో నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్పై అందరి దృష్టీ నిలిచింది.
బీజేపీ అక్కడ మరోసారి తన కాషాయ జెండాను పాతుతుందంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఫలితాలు ఉత్కంఠతను రేకెత్తిస్తోన్నాయి. ఉత్తర ప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్లల్లో సరిగ్గా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే- ఉత్తర ప్రదేశ్లో ప్రారంభ ఫలితాల్లో బీజేపీ హవా కనిపించినప్పటికీ.. ఎంతో సేపు ఆ ఆధిక్యత కొనసాగలేదు.
అనూహ్యంగా సమాజ్వాది పార్టీ రేసులోకి దూసుకొచ్చింది. తొలుత- బీజేపీ 15 సీట్లల్లో ఆధిక్యతలో ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్వాది పార్టీ ఎనిమిది సీట్ల వద్ద కనిపించింది. పోస్టల్ బ్యాలెట్ల లెెక్కింపు కొనసాగుతున్న కొద్దీ సమాజ్వాది ఆధిక్యతను సాధిస్తూ వచ్చింది. ఒకదశలో బీజేపీ, సమాజ్వాది పార్టీ 18 సీట్లతో సమానంగా నిలిచాయి. ఆ తరువాత బీజేపీ మళ్లీ పుంజుకొంది. భారీ ముందడుగు వేసింది. ఏకంగా ఏడు స్థానాల్లో ఆధిక్యతలో నిలిచింది.
మరో మాజీ ముఖ్యమంత్రి మాయావతి నాయకత్వాన్ని వహిస్తోన్న బహుజన్ సమాజ్ వాది పార్టీ రెండు, రాష్ట్రీయ లోక్దళ్ ఒకటి, ఏడీఎస్ ఒకచోట ముందంజ వేశాయి. పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన వెంటనే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తెరుస్తారు ఎన్నికల అధికారులు. ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కంపు కొనసాగుతోంది. కాగా- ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి అక్కడ కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.