బెంగళూరు ఎన్నికలు: కాంగ్రెస్కు బిజెపి షాక్
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు బీజేపీ పెద్ద షాక్ ఇచ్చింది. బెంగళూరులో అత్యధికంగా కార్పొరేటర్లను గెలిపించుకుని అధికార పీఠం దక్కించుకోవడానికి బీజేపీ సిద్దం అయ్యింది.
బెంగళూరు నగరంలో ఉన్న మంత్రులు భంగపాటుకు గురౌతున్నారు. బెంగళూరులో అధికారం తమదేనంటూఇంత కాలం కాలర్ ఎగరేసుకుని తిరిగిన కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. బెంగళూరును మూడు ముక్కలు చెయ్యాలని ఒంటికాలి మీద నిలబడిన కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెప్పారు.
బెంగళూరు నగరంలో 198 వార్డులు ఉన్నాయి. హోంగసంద్రవార్డులో బీజేపీ అభ్యర్థి భారతి ఏకగ్రీంగా ఎన్నిక అయ్యారు. ఎన్నికలు జరగక ముందే బీజేపీ బోణి చేసింది. తరువాత 197 వార్డులలో ఎన్నికలు జరిగాయి. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ తో పాటు పలు పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటిలో ఉన్నారు.
ఈ నెల 22వ తేదిన ఓటింగ్ జరిగింది. మంగళవారం ఉదయం 8 గంటల నుండి 197 వార్డులకు సంబంధించి 27 కేంద్రాలలో కౌంటింగ్ జరిగింది. మొదటి నుంచి బీజేపీ అభ్యర్థులు పలు వార్డులలో ఆధిక్యంలో ఉన్నారు. ఉదయం 11.20 గంటలకు బీజేపీ 63, కాంగ్రెస్ 45, జేడీఎస్ 11, ఐదు మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపోందారు.
బీజేపీ 68, కాంగ్రెస్ 45, జేడీఎస్ 11, స్వతంత్రులు ఆరు స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు. తాము దాదాపు విధ్యావంతులకే టిక్కెట్లు ఇచ్చామని, యువతను ప్రోత్సహించామని చెప్పుకున్న కాంగ్రెస్ నాయకులు కంగు తిన్నారు. సర్వేలు సైతం తల్లకిందులు అయ్యాయి.