ప్రెస్టీజ్ కోసం పోయి కటకటాలపాలు: పెళ్లికి వెళ్లేందుకు కారును దొంగలించిన మహిళ
ఒక వివాహానికి వెళుతున్నాం అనుకోండి... అక్కడ అందరూ మనలనే చూడాలని అనుకుంటాం. అంతలా చక్కగా ముస్తాబై వెళతాం. ఇక పెళ్లే మనింట్లో జరుగుతుంటే ఇంకెంత రెడీ అవుతాం... ఆ హంగు ఆర్భాటమే వేరు. ఇక పెళ్లికి వెళుతున్నామంటే చాలు అమ్మాయిలు మేకప్ వేసుకునేందుకు అందంగా ముస్తాబయ్యేందుకు గంటల సమయం తీసుకుంటారు. ఇక నగలు చీరెలపై పెట్టే దృష్టి అంతా ఇంతా కాదు. ఎందుకంటే పెళ్లికి వచ్చిన వారు తమ చీరెలు గురించే చర్చించుకోవాలని... తాము ధరించిన నగల గురించే మాట్లాడుకోవాలనే ఆతురత ప్రతి మహిళలోను ఉంటుంది. ఇది ఒక్క పెళ్లికే పరిమితం కాదనుకోండి... ఇలా ఏ ఫంక్షన్కు వెళ్లాల్సి వచ్చినా ముందుగా స్త్రీల మెదడులో మెలిగేది ఆ ఫంక్షన్కు ఎలాంటి చీర కట్టుకోవాలి.. లేదా ఎలాంటి నగలు ధరించాలని. ఇంకొందరైతే పెళ్లికి లేట్ అయినా ఫర్వాలేదు కానీ లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చి గ్రాండ్గా కనిపించి అందరి దృష్టి తమవైపు మరల్చుకునేలా ప్లాన్ చేసుకుంటారు.
నా స్టేటస్ ఏమిటో పెళ్లిలో చూపించాలి
ఇక అసలు స్టోరీలోకి ఎంటర్ అయితే జార్ఖండ్కు చెందిన గజాలా అలియాస్ సప్నా అనే మహిళ ఢిల్లీలో నివాసం ఉంటోంది. ఆమెకు 2009లోనే వివాహమైంది. ఆ తర్వాత భర్తతో గొడవలు తలెత్తడంతో ఆయన్ను విడిచి వర్మ అనే వ్యక్తితో డెహ్రాడూన్లో నివాసముంటోంది. ఈ క్రమంలోనే తన సోదరుడి వివాహానికి రావాల్సిందిగా ఆమెకు ఆహ్వానం అందింది. ఇంకే సప్న తను సిటీలో ఎలాంటి విలాసవంతమైన జీవితం గడుపుతుందో తన బంధువులకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఆ మేరకు కలరింగ్ ఇవ్వాలని భావించింది. ఇందుకోసం పెళ్లికి కారులో వెళ్లాలని భావించింది. కాని వారికి సొంతంగా కారులేదు. కానీ ఎలాగైనా కారులోనే వివాహ వేదిక దగ్గర దిగి తన బంధువులకు తనేంటో చూపించాలనుకుంది.
పెళ్లికి వెళ్లేందుకు కారు దొంగతనం
తన స్టేటస్కు కారు సింబల్గా ఉంటుందని భావించిన గజాలా అలియాస్ సప్నా... కారులో ఎలాగైనా పెళ్లికి వెళ్లాలని భావించి ఒక కారు దొంగతనానికి స్కెచ్ వేశారు. ఇందుకోసం వర్మ అనే వ్యక్తితో పాటు మరో వ్యక్తి కాజల్ సాయం కూడా కోరింది. అక్టోబర్ 3వ తేదీన డెహ్రాడూన్ నుంచి ఢిల్లీలోని పాలెం వరకు ఒక క్యాబ్ అద్దెకు మాట్లాడుకున్నారు. వారు ఆ కారులో ప్రయాణించాకా ఢిల్లీలోని మూల్చంద్ ఫ్లై ఓవర్కు చేరుకోగానే డ్రైవర్ తలపై గన్ ఉంచి కారు తమకు అప్పగించాల్సిందిగా కోరారు. లేదంటే చంపేస్తామని బెదిరించారు. కారు వారికి అప్పగించి డ్రైవర్ శుభం శర్మ అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
కారులో ఉన్న జీపీఎస్ వ్యవస్థతో పోలీసులకు చిక్కిన దొంగలు
కారును పట్టుకోవడంలో పోలీసులు పెద్దగా శ్రమపడలేదు. కారులో జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఉన్నందున వారికి పెద్దగా పనిలేకుండానే ఆ కారును ఈజీగా ట్రాక్ చేయగలిగారు పోలీసులు. ఫిర్యాదు వచ్చిన తర్వాత కార్ను ట్రాక్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేషోపూర్ మండి దగ్గర వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని కారు దొంగలించిన సప్న, వర్మలుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారు కారును వదిలి బైకుపై వస్తున్న సమయంలో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ బైకును కూడా వారు దొంగలించినట్లు చెప్పారు. స్టేషన్కు తీసుకెళ్లి విచారణ చేయగా అసలు నిజం ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
స్టేటస్ కోసం పోయి కటకటాల వెనక్కు
తమ బంధువుల ముందు పరువు పోకూడదనే దొంగతనానికి పాల్పడినట్లు సప్నా వెల్లడించింది. కారులో వస్తే తన బంధువుల ముందు తన స్టేటస్ పెరుగుతుందని భావించి కారు లేకపోవడంతో దొంగతనం చేశామని సప్నా ఒప్పుకుంది. తన కుటుంబం పేద కుటుంబం అని చెప్పిన సప్నా... తమ్ముడి పెళ్లికి కారులో వచ్చి తన స్టేటస్ ఏమిటో చూపించుకోవాలన్న ఆశతోనే దొంగతనం చేసినట్లు సప్నా వెల్లడించింది. సప్పా దగ్గర నుంచి బైకుతో పాటు ఒక దేశీ తుపాకి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.