ప్రముఖ నటిపై లైంగిక దాడి కేసులో కోర్టు సంచలన తీర్పు..!
కేరళలో సంచలన సృష్టించిన ప్రముఖ మలయాళ నటి లైంగిక దాడి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఎర్నాకుళం సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనలో ఆరుగురు నిందితులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే బాధిత నటి పట్ల జరిగిన మానసిక, శారీరక హింసను పరిగణనలోకి తీసుకొని రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. తీర్పు సమయంలో న్యాయమూర్తి నిర్భయ కేసులో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, మహిళల భద్రతపై రాష్ట్రం తీసుకోవాల్సిన బాధ్యతలను గుర్తుచేశారు.
కాగా తీర్పు అనంతరం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీడియాతో మాట్లాడుతూ.. నిందితులకు విధించిన శిక్ష తక్కువగానే ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాధితురాలిపై జరిగిన నేరం తీవ్రత దృష్ట్యా మరింత కఠిన శిక్ష అవసరమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే కేరళ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.

2017లో కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటన..
మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో నటించిన ప్రముఖ నటి 2017 ఫిబ్రవరి 17న ఒక మూవీ షూటింగ్ ముగించుకొని వెళ్తుండగా.. కొచ్చి సమీపంలో దుండగులు ఆమె కారును అడ్డుకుని కిడ్నాప్ చేశారు. అనంతరం కారులోనే ఆమెపై లైంగిక వేధింపులు, దాడి జరిపారు. ఈ ఘటన సినీ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
దిలీప్తో సహా 10 మందిపై కేసులు..
ఈ కేసులో పోలీసులు నటుడు దిలీప్తో సహా 10 మందిని అరెస్ట్ చేశారు. వారిపై కిడ్నాప్, లైంగిక వేధింపులు, గ్యాంగ్రేప్, ఆధారాలు ధ్వంసం చేయడం, కుట్ర వంటి పలు తీవ్ర కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత దర్యాప్తు జరిపి, అదే ఏడాది మొదటి ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ఈ దర్యాప్తు ప్రక్రియలో మొబైల్ డేటా, వాహనాల జీపీఎస్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ సాక్ష్యాలు కీలక పాత్ర పోషించాయి.
అయితే నటుడు దిలీప్పై ఉన్న ఆరోపణలను పరిశీలించి, సాక్ష్యాలు తీవ్ర అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొంటూ ఆయనను నిర్దోషిగా తేల్చింది. ఇదే కేసులో మరో ముగ్గురు నిందితులకు కూడా కోర్టు ఉపశమనాన్ని ఇచ్చింది. దీంతో మిగిలిన ఆరుగురు నిందితులపై నేరం నిరూపితమైంది. ఈ తీర్పు ఇటువంటి నేరాలు పునరావృతం కాకుండా నిరోధక చర్యగా నిలుస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇక ప్రాసిక్యూషన్ హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించడంతో, ఈ కేసు మరింత కీలక దశకు చేరుకునే అవకాశం ఉంది. శిక్ష పెంపు, అదనపు ఆరోపణల పరిశీలన వంటి అంశాలు హైకోర్టులో చర్చకు రావచ్చు. మరోవైపు నిర్దోషిగా తేలిన నిందితులపై కొత్త సాక్ష్యాలు వెలుగులోకొస్తే, కేసు తదుపరి దశల్లో నూతన పరిణామాలు చోటుచేసుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications