చిన్నారులపై కోవాగ్జిన్,జైదుస్ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి : కేంద్రం
భారత్లో చిన్నారులకు వ్యాక్సినేషన్కి సంబంధించి ప్రస్తుతం కోవాగ్జిన్,జైదుస్ క్యాడిలా వ్యాక్సిన్లు చిన్నారులపై క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.'చిన్నారులకు ఏ వ్యాక్సిన్ ఇవ్వాలనే అంశానికి సంబంధించి ఒక విషయం గుర్తుంచుకోవాలి. భారత్లో చిన్నారులకు వ్యాక్సినేషన్ ఇవ్వాలంటే దాదాపు 25 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరం. కేవలం కొంతమందికే వ్యాక్సిన్ ఇచ్చి మిగతా వాళ్లను వదిలేయలేం. ఇప్పటికే చిన్నారులపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇవి ఇమ్యునోజెనిసిటీ ట్రయల్స్ కాబట్టి పెద్దగా సమయం పట్టకపోవచ్చు.' అని నీతి ఆయోగ్ సభ్యుడు డా.వీకె పాల్ తెలిపారు.
'జైదుస్ వ్యాక్సిన్ కూడా చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ జరుపుతోంది. లైసెన్స్ కోసం బహుశా వచ్చే రెండు వారాల్లో ఆ సంస్థ దరఖాస్తు చేసుకుంటే... ఆ టీకా పిల్లలకు ఇవ్వవచ్చా అనే దానిపై ఒక అభిప్రాయానికి రావడానికి మనకు తగినంత డేటా లభిస్తుంది.' అని వీకె పాల్ తెలిపారు.
భారత్ బయోటెక్ కోవాగ్జిన్కు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా వీకె పాల్ తెలిపారు. త్వరలోనే ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం దానికి సంబంధించిన డేటా షేరింగ్ జరుగుతోందన్నారు.
ప్రస్తుతం భారత్లో 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. సమీప భవిష్యత్తులో చిన్నారులకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే యూకెలో 12 ఏళ్లు పైబడ్డవారికి ఫైజర్ వ్యాక్సిన్కి అనుమతినిచ్చారు. భారత్లో కోవాగ్జిన్,జైదుస్ క్యాడిలా క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయితే త్వరలోనే ఇక్కడ కూడా చిన్నారులకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం బిహార్ పట్నాలోని ఎయిమ్స్లో 525 మంది చిన్నారులపై కోవాగ్జిన్ ట్రయల్స్ జరుపుతున్నారు. టీకా వేసే ముందు వారికి యాంటీ జెన్,ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. ప్రతీరోజూ చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. వ్యాక్సిన్ ట్రయల్స్కు ప్రధాన పర్యవేక్షకుడిగా ఉన్న డా.సింగ్ ఇటీవల ఈ విషయాలను వెల్లడించారు.