ఇలాగైతే దేవుడు కూడా కాపాడలేడు... సెప్టెంబర్ కల్లా పీక్ స్టేజెస్కు కరోనా..!
బెంగళూరు: కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. కనిపించని శతృవుగా పిలువబడుతున్న ఈ మాయదారి రోగం అగ్రదేశాలకు నిద్ర పట్టకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి 37 లక్షలకు పైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఇప్పటికే 5.86 లక్షల మంది దీని బారిన పడి మృతి చెందారు. ఇక భారత్ పరిస్థితి చూస్తే రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. లాక్డౌన్ ఉన్న సమయంలో పరిస్థితి కాస్త కంట్రోల్లోనే ఉందని భావించినప్పటికీ ఒక్కసారి అన్లాక్ ప్రకటించగానే కేసులు కుప్పలు కుప్పలుగా వస్తున్నాయి. అంతేకాదు మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటంతో పలువురు ఆరోగ్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో 40వేల చేరువలో కరోనా పాజిటివ్ కేసులు: 11 మరణాలు
సెప్టెంబర్ కల్లా కేసుల సంఖ్య
కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)కు చెందిన ఒక బృందం ప్రస్తుత ట్రెండ్ను పరిగణలోకి తీసుకుని సెప్టెంబర్లో వైరస్ పరిస్థితి ఎలా ఉంటుందనేది అంచనా వేసింది. సెప్టెంబర్ 1కల్లా భారత దేశంలో 35 లక్షల కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతాయని పేర్కొంది. ఒక్క కర్నాటకలో 2.1 లక్షల పాజిటివ్ కేసులు ఉంటాయని వెల్లడించింది. ఇక ఈ 35 లక్షల కరోనావైరస్ పాజిటివ్ కేసులో 10 లక్షల 71,300 యాక్టివ్ కేసులు ఉంటాయని జోస్యం చెబుతోంది.
1.88 లక్షల మరణాలు
ఇక సెప్టెంబర్ రెండో వారంలో భారత్లో 4.78 లక్షల యాక్టివ్ కేసులు నమోదవుతాయని చెప్పిన బృందం మార్చి 2021 నాటికి 1.4 లక్షల యాక్టివ్ కేసులు, 1.88 లక్షల మరణాలు నమోదు అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. అయితే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 37.4 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 కల్లా భారత్లో మరణాల సంఖ్య 1.4 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేశారు ప్రొఫెసర్ శశికుమార్ మరియు ప్రొఫెసర్ దీపక్. 1.4 లక్షల మరణాల్లో 25వేల మరణాలు మహారాష్ట్రలో సంభవిస్తాయని, ఢిల్లీలో 9,700 మరణాలు, కర్నాటకలో 8500 మరణాలు, తమిళనాడులో 6300 మరణాలు గుజరాత్లో 7,300 మరణాలు చోటుచేసుకుంటాయని తెలిపారు.
మార్చి 2021లో పరిస్థితేంటి..?
ఇక నవంబర్ నెల నాటికి భారత్లో 1.2 కోట్లు కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతాయని ఈ బృందం అంచనా వేస్తోంది. అదే సమయంలో 5 లక్షల మరణాలు సంభవిస్తాయని చెబుతోంది. ఇక జనవరి 1 నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 2.9 కోట్లకు చేరుకుంటుండగా 10 లక్షల మంది మృత్యువాత పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక అత్యంత దారుణమైన పరిస్థితే తలెత్తితే ఆ సమయంలో ఎన్ని కేసులు నమోదవుతాయో అంచనావేయలేని పరిస్థితి అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పేర్కొంది. మార్చి 2021 నాటికి ఎలా ఉంటుందనేది చెప్పలేమని... ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా మాత్రమే ఎన్ని కేసులు ఉంటాయనేది అంచనావేస్తున్నామని స్పష్టం చేసింది.