కరోనా ఎఫెక్ట్... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట... వంద శాతం వర్క్ ఫ్రమ్ హోమ్...
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి రీత్యా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 'వర్క్ ఫ్రమ్ హోమ్' అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. గర్భిణీ స్త్రీలు,వికలాంగులు,కంటైన్మెంట్ జోన్లలో నివసించే ఉద్యోగులకు 100శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది,శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మే 31 వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్కు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది.
అంతకుముందు,ఏప్రిల్ 19న ఇచ్చిన ఉత్తర్వుల్లో 50శాతం మంది ఉద్యోగులతోనే ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే డిప్యూటీ సెక్రటరీ,అంతకన్నా ఉన్నత హోదాలో ఉన్న అధికారులంతా ప్రతీరోజూ కార్యాలయాలకు రావాల్సిందేనని తెలిపింది. డిప్యూటీ సెక్రటరీ కింది హోదాల్లో ఉన్నవారికి మాత్రమే వెసులుబాటు కల్పించింది. ఆయా అధికారుల మొత్తం సంఖ్యలో 50శాతం సిబ్బంది కార్యాలయాలకు హాజరుకావాల్సిందిగా సూచించింది. అప్పుడు కూడా గర్భిణీ స్త్రీలు,వికలాంగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కల్పించింది.
ఇక దేశంలో కరోనా కేసుల విషయానికి వస్తే సెకండ్ వేవ్ ఉధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 4.14లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2.1కోట్లకు చేరగా ప్రస్తుతం 36.45 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో గడిచిన 24 గంటల్లో మరో 3915 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 2.34 లక్షలకు చేరింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 16.49లక్షల మందికి వ్యాక్సిన్ అందించారు. 90లక్షల పైచిలుకు వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు అందుబాటులో ఉన్నాయి. మరో మూడు రోజుల్లో అదనంగా 10లక్షల డోసులు రాష్ట్రాలకు చేరనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కొవిడ్ ఉధృతిపై పలు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ గురువారం(మే 6) సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ సీఎంలతో పాటు పుదుచ్చేరి,జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లతో మాట్లాడినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై మోదీ ఆరా తీశారు.రాష్ట్రాలకు కరోనా కట్టడి విషయంలో తగిన సాయం అందిస్తామన్నారు. అలాగే రాష్ట్రాలు కేంద్రానికి తగిన సూచనలు చేయాలని, వైద్యరంగంలో మౌలిక వసతుల కల్పనకు సహకరించాలని మంత్రులు, అధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు.