వ్యాక్సిన్లపై కేంద్రం కీలక నిర్ణయం -ఆ జిల్లాల్లో 45+ అందరికీ టీకాలు -2వారాల్లోగా చేయాలని రాష్ట్రాలకు ఆదేశం
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ అందరినీ కలవరపెడుతోంది. కొత్త కేసులు, మరణాలు మళ్లీ తారాస్థాయికి చేరడంతో ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఇప్పటికే రెండు రకాల వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. ప్రస్తుతానికి వాటిని 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45ఏళ్లు దాటి వివిధ వ్యాధులతో బాధపడేవారికి మాత్రమే అందిస్తుండగా, రాబోయే రోజుల్లో 45 దాటిని ప్రతి ఒక్కరికీ టీకాలను అందించాలని నిర్ణయించింది. ముందుగా..
కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న జిల్లాల్లో వయసు 45 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తికి విధిగా కొవిడ్ టీకాలను అందించాలని, ఈ ప్రక్రియను ఏప్రిల్ 1 నుంచి మొదలుపెట్టి, రెండు వారాల్లోగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖల కార్యదర్శులకు ఉత్తర్వులు పంపింది. కరోనా కేసులు, వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో 45 ఏళ్లు పైబడిన వారికి 100 శాతం వ్యాక్సినేషన్కు చర్యలు తీసుకోవాలని, కేసుల పెరుగుదలతో సంబంధం లేకుండా ప్రతి జిల్లాకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని లేఖల్లో పేర్కొంది. అంతేకాదు..
కొవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్న జిల్లాల్లో అత్యవసర కేంద్రాలను ఏర్పాటు చేసి '24×7' విధానంలో కేసుల వృద్ధి, పాజిటివిటీ రేటు, వ్యాప్తిని పరిశీలించాలని, ఆయా జిల్లా కలెక్టర్లు రోజుకు రెండుసార్లు కొవిడ్ పై రివ్యూలు చేయాలని, కంటెయిన్మెంట్ జోన్లను, 'టెస్ట్, ట్రాక్, ట్రీట్' సిద్ధాంతాన్ని పకడ్బందీగా అమలు చేయాలలని కేంద్రం తన లేఖలో తెలిపింది.
ఆయా జిల్లాల్లో కొవిడ్ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో కనిపెట్టాలని, వైరస్ను గుర్తించడంలో లేదా వైద్యం అందించడంలో లేదా వైద్య వసతుల కల్పనలో.. ఎక్కడైనా లోపాలున్నాయా? అన్నది నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని, అన్నిచోట్లా 70%కి మించి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయాలని బయటపడిన ప్రతి కొవిడ్ కేసుకు సంబంధించి 25-30 మంది 'కాంటాక్ట్' వ్యక్తులను గుర్తించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం రాసిన లేఖలో పేర్కొన్నారు.
తిరుపతి పోరు: పవన్ ఎంట్రీ ఖరారు -రత్నప్రభ కోసం ఏప్రిల్ 3న జనసేనాని పాదయాత్ర -బీజేపీలో ఫుల్ జోష్
కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో కొత్తగా 53,480 కేసులు, 354 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 1,21,49,335కు, మొత్తం మరణాలు 1,62,468కు పెరిగాయి. మంగళవారం ఒక్కరోజే 19,40,999 మందికి టీకాలు అందించగా, ఇప్పటివరకు 6,30,54,353 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.