కరోనా విలయం: రెండేళ్ల దాకా కోలుకోలేం.. మళ్లీ మహా ఆర్థిక మాంద్యం.. ఇదొక్కటే పరిష్కారం..
ప్రస్తుత కరోనా విలయం ద్వరా తలెత్తే ఆర్థిక సంక్షోభం.. 1930 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం(గ్రేట్ డిప్రెషన్) కంటే దారుణంగా ఉంటుందని, రెండేళ్ల తర్వాత కూడా దాని ప్రభావం నుంచి కోలుకునే పరిస్థితి కనిపించడం లేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా అన్నారు. గడిచిన శతాబ్దంలో మానవాళి ఎదుర్కొన్న సంక్షోభాలన్నిటిలోకి కొవిడ్-19 ఎఫెక్ట్ అతి తీవ్రంగా ఉంటుదని చెప్పారు.

170 దేశాలు విలవిల
కరోనా కారణంగా ఆర్థిక మాంద్యం తప్పదని ఇదివరకే హెచ్చరించిన ఐఎంఎఫ్ చీఫ్.. 2020లోనే ప్రపంచ వృద్ధి రేటు నెగటివ్ లోకి వెళ్లిపోతుందని, 180 ఐఎంఎఫ్ సభ్య దేశాల్లో ఏకంగా 170 దేశాల్లో తలసరి ఆదాయం పతన స్థాయికి క్షీణించడమే అందుకు నిదర్శనమి వివరించారు. వచ్చే వారం జరుగనున్న ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ సంయుక్త సమావేశాల నేపథ్యంలో క్రిస్టలినా జార్జీవా గురువారం కీలక ప్రసంగం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆమె, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ మీటింగ్ కూడా వర్చువల్ గానే నిర్వహించనున్నట్లు తెలిపారు.

వైరస్ తగ్గినా..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గినప్పటికీ.. ఆర్థిక వ్యవస్థ పతనాన్ని అరికట్టలేమని, వచ్చే ఏడాది నాటికి.. అది కూడా నెగటివ్ ప్రభావం నుంచి పాక్షికంగా మాత్రమే ఆర్థిక వ్యవస్థ కోలుకోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఐఎంఎఫ్ దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరికిగానీ కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టబోదని, తద్వారా పరిస్థితి ఇంకాస్త దిగజారే అవకాశాలే కనిపిస్తున్నాయని క్రిస్టలినా చెప్పారు. కొవిడ్-19 దెబ్బకు పేద, ధనిక దేశాలతోపాటు అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థలు కూడా ఒకే తీరుగా దెబ్బతిన్నాయని ఆమె వివరించారు.

పరిష్కారం ఏంటంటే..
నిజానికి జనవరిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.3గా ఉంటుందని, వచ్చే ఏడాది 3.4గా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనాలు వేసింది. కానీ కరోనా ఎఫెక్ట్ కు ప్రపంచ స్వరూపం మారినట్లే భావించాలని, వైరస్ ధాటికి ఎటు చూసినా తీవ్రమైన అనిశ్చితి కనిపిస్తున్నదని క్రిస్టలినా అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయా ప్రభుత్వాలు.. తమ దేశాల్లోని కుటుంబాలకు, వ్యాపారాలు తిరిగి కోలుకునేదాకా పూర్తి స్థాయిలో అండగా నిలవడం ఒక్కటే పరిష్కారమార్గమని సూచించారు. ఇప్పటికే పలు దేశాలు దాదాపు 8 ట్రిలియన్ డాలర్ల విలువైన ప్యాకేజీలను ప్రకటించడాన్ని ఆమె గుర్తుచేశారు.
Recommended Video

లక్ష మరణాల దిశగా..
దాదాపు 200 దేశాల్లో విలయం సృష్టిస్తోన్న కరోనా మహమ్మారి గురువారం నాటికి 90 వేల మందిని బలితీసుకుంది. మొత్తం పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 15 లక్షలు దాటగా, అందులో వేల మంది క్రిటికల్ కండిషన్ లో కొట్టుమిట్టాడుతున్నారు. తీవ్రతను బట్టి వచ్చే 24 గంటల్లోనే మరణాల సంఖ్య 1లక్ష దాటే అవకాశం ఉంది. ఇటలీలో అత్యధికంగా 17,700 మంది, స్పెయిన్ లో 15,238, అమెరికాలో 14,865 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో కొవిడ్-19 కేసుల సంఖ్య 5865గా నమోదుకాగా, అందులో 169 మంది ప్రాణాలు కోల్పోయారు. 477 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.












Click it and Unblock the Notifications