షాకింగ్: కొవిడ్ ఓ భారీ కుంభకోణం -ఈ తీరు వల్లే కొంప మునిగిందన్న కేంద్రం -మనం అలిసినా వైరస్ ఆగదు
ఏడాదిన్నరగా భూగోళాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే దాదాపు 32లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. సెకండ్ వేవ్ లో భారత్ ను మాత్రమే టార్గెట్ చేసిందా అన్నట్లుగా రోజువారీ కొత్త కేసులు, మరణాలు పట్టపగ్గాల్లేకుండా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం నాటి లెక్కల ప్రకారం దేశంలో కొత్తగా 3,86,452 కేసులు, 3498మరణాలు నమోదయ్యాయి. మొత్తంగా కేసుల సంఖ్య 1.87కోట్లకు, మరణాల సంఖ్య 2.04లక్షలకు పెరిగాయి. మరో రెండు నెలలపాటు విపత్కర పరిస్థితులు కొనసాగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్న సమయంలోనే కొవిడ్ పై కేంద్ర సర్కారు సంచలన వ్యాఖ్యలు చేసింది.

కొవిడ్ కుంభకోణం లాంటిదే..
దేశంలో కొవిడ్ పరిస్థితి, ఆక్సిజన్ కొరత, వ్యాక్సినేషన్ డ్రైవ్, వైరస్ పట్ల జనాల్లో నెలకొన్న భయాందోళనలు, వైద్య సౌకర్యాల కల్పన తదితర అంశాలపై కేంద్ర ఆరోగ్య శాఖ, హోం శాఖ, ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ ఉమ్మడిగా శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. తొలుత కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, కొవిడ్ ఓ కుంభకోణం(స్కామ్) అనే భావన ఇప్పటికీ చాలా మంది మనసుల్లో ఉందని, కొవిడ్ కు మించిన జీవితం కూడా ఉందని నమ్మేవాళ్ల సంఖ్యా ఎక్కువగానే ఉందని, ఈ రెండు కారణాల వల్ల దేశంలో పరిస్థితి దారుణంగా తయారైందని లవ్ అగర్వాల్ అన్నారు.

వైరస్ కు అలసట ఉండదు..
''ఏప్రిల్ 15 తర్వాత దేశంలో వైరస్ విజృంభణ పెరిగింది. కేవలం మహారాష్ట్ర, ఢిల్లీ, ఛత్తీస్గఢ్ లాంటి 10 రాష్ట్రాల్లో మాత్రమే మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. కొవిడ్ వల్ల చనిపోతున్నవారిలో 60 శాతం మంది ఆ రాష్ట్రాల వారే. గతేడాది సెప్టెంబర్ తో పోల్చుకుంటే ఇప్పుడు భారీగా పెరిగిన కేసుల వల్ల వైద్యారోగ్య వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. కొవిడ్ పై పోరాటంలో మనం అలసిపోయినప్పటికీ, వైరస్ మాత్రం ఆగనట్లుగానే వ్యవహరిస్తున్నది. గతంలో ఇతర దేశాలూ ఇలాంటి పరిస్థిని ఎదుర్కొన్నాయి. మనం కూడా దీన్నుంచి గట్టెక్కేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. అన్ని రాష్ట్రాలూ మళ్లీ కొవిడ్ అనుమానిత వార్డులను ప్రారంభించాల్సిందే'' అని లవ్ అగర్వాల్ అన్నారు.
Recommended Video

భయాన్నొ తొలగించే చర్యలు..
కరోనా రెండో దశలో వైరస్ నిజంగా చేస్తోన్న చేటు కంటే ప్రజల్లో, రోగుల్లో నెలకొన్న భయాందోళనలు ఇబ్బందికర పరిణామాలకు దారి తీస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. అన్ని ఆస్పత్రుల్లో రోగుల సమస్యలు, సందేహాలను తీర్చేలా మైకుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రకటనలు చేసే ఏర్పాట్లుండాలని లవ్ అగర్వాల్ సూచించారు. కరోనాను ఇంకా కుంభకోణంగా చూడటం లేదా కొవిడ్ ను మించిన జీవితం ఉందనే భావనలు మానుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు. బ్రేక్ ది చైన్ విధానాన్ని మళ్లీ అమలు చేయాలని, కరోనాకు ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారు యాంటీవైరల్ ఇంజక్షన్ రెమ్డెసివిర్ను తీసుకోవద్దని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్దీప్ గులేరియా సూచించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అవసరమైన ఆక్సిజన్ సరఫరాలు పునరుద్ధరించామని కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ గోయల్ తెలిపారు.












Click it and Unblock the Notifications