Covishield vs Covaxin: ఆ వ్యాక్సిన్తోనే శరీరంలో యాంటీబాడీస్ అధికం: రీసెర్చ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటిదాకా 23,13,22,417 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదివరకు ఉన్న వ్యాక్సిన్ల కొరత కూడా ఇప్పుడు పెద్దగా లేకపోవడం వల్ల దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ మూడో విడత వ్యాక్సినేషన్ కూడా ఊపందుకుంది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకాలను వ్యాక్సినేషన్ కోసం వినియోగిస్తోన్నారు. త్వరలోనే రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ ఇందులో జత కానుంది.
కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల ప్రభావం ఎలా ఉందనే విషయంపై భారత్కు చెందిన నిపుణులు ఓ అధ్యయనం చేశారు. ఈ రెండింటి పనితీరు మీద దేశీయంగా చేపట్టిన మొట్టమొదటి స్టడీ ఇది. ఈ సందర్భంగా డాక్టర్ ఏకే శర్మ సారథ్యంలోని నిపుణుల బృందం నిపుణులు కీలక విషయాలను గుర్తించింది. కోవాగ్జిన్ 70 శాతం మేర ప్రభావం చూపుతోందని నిర్ధారించారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్తో పోల్చుకుంటే.. ఇది తక్కువే. క్లినికల్ ట్రయల్స్ సందర్భంగా కోవిషీల్డ్ ప్రభావం 81 శాతం మేర ఉంటుందని అప్పట్లో తేలింది.
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న 305 మంది పురుషులు, 210 మంది మహిళా హెల్త్వర్కర్లుపై ఈ నిపుణులు బృందం స్టడీ చేయగా.. 95 శాతం సెరోపాజిటివిటీ (అత్యధిక యాంటీబాడీస్) ఉన్నట్లు నిర్ధారించిందీ టీమ్. వారిలో 425 మంది కోవిషీల్డ్, 90 మంది కోవాగ్జిన్ టీకాను తీసుకున్నారు. ఇందులో కోవిషీల్డ్ టీకా తీసుకున్న 425 మందిలో 98.1 శాతం, కోవాగ్జిన్ తీసుకున్న వారిలో 80 శాతం మేర యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినట్లు గుర్తించినట్లు నిపుణుల బృందం తెలిపింది. ఈ రెండు టీకాలు కూడా అంచనాలకు అనుగుణంగానే ఫలితాలను ఇస్తోన్నాయని పేర్కొంది.
రెండింటి పనితీరు బాగుందని, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తరువాత వారి శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతోందని స్పష్టం చేసింది. సెరోపాజిటివిటీ రేటు, సగటు యాంటీ-స్పైక్ యాంటీబాడీ టైటర్లు కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ వల్లే ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నట్లు తాము గుర్తించామని తెలిపింది. కోవాక్జిన్ టీకా తీసుకున్నవారితో పోల్చుకుంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనే సెరోపాజిటివిటీ, యాంటీ స్పైక్, యాంటీబాడీస్ అధికంగా ఉన్నాయని గుర్తించినట్లు తెలిపింది. తాము చేసిన అధ్యయనానికి సంబంధించిన పేపర్లను ఇంకా పబ్లిష్ చేయాల్సి ఉందని వివరించింది.