వాషింగ్టన్ ఎయిర్ పోర్టులో అవు పిడకలతో పట్టుబడి భారత ప్రయాణికులు
న్యూఢిల్లీ/వాషింగ్టన్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మనదేశంలోని గుజరాత్ తోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పలువురు ఆవుపేడను ఒంటికి రాసుకుంటున్న విషయం తెలిసిందే. కరోనా నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నామని వారు చెబుతున్నారు. అయితే, వైద్యులు మాత్రం పేడను రాసుకోవడం వల్ల ప్రమాదకర ఇన్ఫెక్షన్లు సోకుతాయని హెచ్చరిస్తున్నారు.
ఆవుపేడ పూసుకుంటే కరోనాకు చెక్?: ప్రమాదకర ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటూ వైద్యుల హెచ్చరిక
ఇది ఇలావుండగా, అమెరికాలోని వాషింగ్టన్ డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏప్రిల్ నెలలో అధికారుల తనిఖీల్లో కొందరు భారత ప్రయాణికుల బ్యాగుల్లో ఆవు పేడ పిడకలు లభ్యమయ్యాయి. ఏప్రిల్ 4న తనిఖీల్లో భాగంగా పిడకలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఎయిరిండియా విమానంలో వచ్చిన ప్రయాణికుల బాగుల్లో ఈ ఆవుపేడ పిడకలను గుర్తించినట్లు కస్టమ్ అధికారులు తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా చూడగా పిడకలు లభ్యమయ్యాయని చెప్పారు. పాదాలు, నోటి వ్యాధుల కారణంగా ఇండియా నుంచి ఆవు పేడ పిడకలను అమెరికాలోకి అనుమతించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో బ్యాగ్ల్లో లభించిన ఆవు పేడ పిడకలను అక్కడే నాశనం చేసినట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఎండిన పిడకలను భారత్ తోపాటు ప్రపంంలోని చాలా ప్రాంతాల్లో వంట చెఱుకుగా ఉపయోగిస్తారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో పేడను ఎండపెట్టి పిడకలుగా చేసి వంట చెఱుకుగా ఉపయోగిస్తున్నారు. తొందరగా అంటుకుని ఎక్కువగా మంటనిస్తుంది. అంతేగాక, ఈ పిడకలను పంట పొలాలకు మంచి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది.