గోమూత్రం తీసుకోవడంతోనే నా క్యాన్సర్ నయమైంది: సాధ్వీ ప్రగ్యా
భోపాల్: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే సన్యాసిని సాధ్వీ ప్రగ్యా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి హెడ్లైన్స్లో నిలిచారు. కొంత గోపంచకం(గోవు మూత్రం) గోవు నుంచి తయారయ్యే ఇతర ఉత్పత్తులు వినియోగించడం వల్లే తనకున్న క్యాన్సర్ జబ్బు నయం అయ్యిందని చెప్పారు.మధ్యప్రదేశ్ భోపాల్ నుంచి బరిలోకి దిగుతున్న సాధ్వీ ప్రగ్యా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మాట్లాడారు. గోవుల చుట్టూ ప్రస్తుత రాజకీయాలు తిరుగుతున్నాయని దానిపై తన అభిప్రాయం అడుగగా... గోవులను చిత్రహింసలకు గురిచేయడం తనను ఎంతగానో బాధిస్తోందని చెప్పారు. గోవులను కలిగి ఉన్నావంటే నీ దగ్గర అమృతం ఉన్నట్లే అని సాధ్వీ చెప్పుకొచ్చారు.
గోవులతో, గోవు నుంచి తయారయ్యే ఉత్పత్తులతో ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిపారు.అయితే గోపంచకం తీసుకోవడం వల్ల తనకు క్యాన్సర్ జబ్బు నయమైందని చెప్పారు. ఆమె ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడిందని గోమూత్రం తీసుకున్న తర్వాతే అది నయం అయిందని వెల్లడించింది.దీంతో పాటు ఆయుర్వేదం తీసుకోవడం వల్ల జబ్బు తగ్గిపోయిందన్నారు. ఇక పంచగవ్య మిశ్రమంను హిందువులు హోమాలు, యజ్ఞాలు చేసే సమయంలో వినియోగిస్తారు. ఇందులో గోవుకు సంబంధించి ఐదు పదార్థాలను కలుపుతారు. అవి ఆవు పేడ, మూత్రం, పాలు. ఇక రెండు పరోక్ష వస్తువులు పెరుగు మరి నెయ్యి. ఈ ఐదు ఉత్పత్తులను కలిపి పులియబెడతారు. గోమాత ఉత్పత్తులతో తాను ఈ రోజు బతికి ఉన్నట్లు సాధ్వీ ప్రగ్యా చెప్పారు.
అంతేకాదు గోవు వెనక బాగం నుంచి మెడవరకు చేత్తో రుద్దడం ద్వారా బీపీ కంట్రోల్ చేసుకోవచ్చని చెప్పారు. ఇలా రుద్దడం ద్వారా గోవుకు కూడా చాలా హాయిగా ఉంటుందని అదే మెడ నుంచి వెనకలకు రుద్దితే గోవు చాలా ఇబ్బంది పడుతుందని చెప్పారు. గోవును ఇంట్లో పెంచుకుంటే మీవద్ద అమృతం ఉన్నట్లే లెక్క అని చెప్పిన సాధ్వీ... తపస్సు చేసుకోవాలంటే అందుకు అనువైన స్థలం గోశాలే అని వెల్లడించారు. ఇదిలా ఉంటే సాధ్వీ సోమవారం భోపాల్ నియోజకవర్గానికి నామినేషన్ దాఖళు చేశారు. మంత్రోఛ్చారణ మధ్య ఆమె నామినేషన్ దాఖలు చేయడం విశేషం. ముహూర్తం బలంగా ఉండటంతో తాను నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. పండితులు మంత్రాలు చదువుతుండగా ప్రగ్యా కలెక్టొరేట్కు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఇక అధికారికంగా మంగళవారం ఆమె నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. హిందువుల క్యాలెండర్ ప్రకారం ఆమె బలమైన ముహూర్తం చూసి నామినేషన్ దాఖలు చేస్తారు.