సీపీఎం మరో'సారీ'!: జ్యోతిబసును ప్రధానిగా చేస్తే బాగుండేది
విశాఖ: పొరపాటు చేసి అనంతరం పశ్చాత్తాపపడటం వామపక్షాలకు అలవాటు అనే వాదన ఉంది. తాజాగా విశాఖలో జరుగుతున్న సీపీఎం మహాసభల్లో మరోసారి సీపీఎం విచారం వ్యక్తం చేసింది! జాతీయ రాజకీయాల్లో పలు సందర్భాల్లో చక్రం తిప్పిన సీపీఎం విస్తరించకపోగా, పట్టు ఉన్న కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోను సవాళ్లను ఎదుర్కొంటోంది. దీనిపై మంగళవారం ఆ పార్టీ జాతీయ మహాసభల్లో విస్తృత చర్చ జరిగింది.
సాధారణంగా గత మూడేళ్ల కాలంలో జరిగిన పరిణామాలపై సీపీఎం ఈ సభల్లో చర్చిస్తుంది. కానీ ఈసారి గత రెండున్నర, మూడు దశాబ్దాలుగా తమ పార్టీ అనుసరించిన విధానాలపై సమీక్షిస్తున్నారు. కేరళలో అధికారం కోల్పోవడం, పశ్చిమ బెంగాల్లో దెబ్బతినడం, లోకసభలో ప్రాధాన్యత బాగా తగ్గిన నేపథ్యంలో.. సీపీఎం అన్ని అంశాలపై చర్చిస్తోంది.
సీపీఎం మహాసభలు
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పది నెలల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోడీ దేశ సంపదను పెట్టుబడిదారులకు ధారాదత్తం చేశారని, ఖనిజసంపద, బొగ్గు నిల్వలు, ఇన్స్యూరెన్స్, రైల్వేలు ఇలా అన్ని రంగాలను పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అన్నారు.
సీపీఎం మహాసభలు
సీపీఎం 21వ జాతీయ మహాసభలు మంగళవారం విశాఖలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వాగతోపన్యాసంలో కారత్ మాట్లాడుతూ దేశంలోని ధనికులకు మేలు చేసేందుకు పలు చట్టాలను సవరించేందుకు కూడా మోదీ వెనకాడడం లేదన్నారు.
సీపీఎం మహాసభలు
దేశంలో పంటలకు గిట్టుబాటు ధర రాక రైతులు, తద్వారా రైతు కూలీలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉద్యోగావకాశాలు రోజు రోజుకూ మృగ్యమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సీపీఎం మహాసభలు
యాజమాన్యాలకు అనుకూలంగా, కార్మిక చట్టాల్లో తీసుకువస్తున్న మార్పుల వల్ల ఆ వర్గాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారన్నారు. ప్రధాని మోడీ హిందూ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నారని కారత్ విమర్శించారు.
సీపీఎం మహాసభలు
ఆరెస్సెస్ కనుసన్నలలో మోడీ పని చేస్తున్నారన్నారు. పాఠ్యాంశాల్లో హిందూమత బోధనకు సంబంధించిన అంశాలను జొప్పించడమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చన్నారు. భారత రాజ్యాంగలో పేర్కొన్న లౌకికవాదాన్ని ఆరెస్సెస్, బీజేపీ ముక్కలు చేస్తోందని విమర్శించారు.
సీపీఎం మహాసభలు
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, పెట్టుబడిదారి విధానాలకు విసిగిన పలు వర్గాలు ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి సమీప భవిష్యత్లోనే ఉందని ప్రకాష్ కారత్ జోస్యం చెప్పారు.
సీపీఎం మహాసభలు
లెఫ్ట్ పార్టీలన్నీ ఏకమై ఈ మహోద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త భూసేకరణ చట్టం వల్ల చాలా మంది జీవనభృతి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
సీపీఎం మహాసభలు
బీమా కంపెనీలు, బొగ్గు గని కార్మికులు ఇలా అన్ని రంగాల వారూ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారన్నారు.
అందులో భాగంగా దివంగత జ్యోతిబసుకు అప్పట్లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా పార్టీ తిరస్కరించడం పొరపాటేననే అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. జ్యోతిబసు ప్రధాని అయి ఉంటే పార్టీకి అది బలంగా మారి మరిన్ని రాష్ట్రాలకు విస్తరించే వీలుండేదని, అలా చేయక పోవడం వల్ల నష్టపోయామని, అది తప్పేనని పలువురు నేతలు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.
కాగా, 1996 లోకసభ ఎన్నికల అనంతరం వామపక్షాలు, జనతాదళ్, తెలుగుదేశం, ఏఐఏడీఎంకే తదితర పార్టీల నేతలు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. జ్యోతిబసు పేరును ప్రధాని పదవి కోసం ప్రతిపాదించారు. దీనిని సీపీఎం కేంద్ర కమిటీ తిరస్కరించింది. ఇది చారిత్రక తప్పిదని, జ్యోతిబసు ప్రధాని అయి ఉంటే పార్టీ మరింత బలపడేదని నాయకులు అభిప్రాయపడ్డారు.