షూటింగ్ కైమాక్స్: ఇద్దరు విలన్ల జలసమాధి ( వీడియో)
బెంగళూరు: కన్నడ నటుడు దునియా విజయ్ హీరోగా నటిస్తున్న మాస్తిగుడి సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో అపశృతి చోటు చేసుకుంది. హెలికాప్టర్ నుంచి చెరువులోకి హీరో విజయ్ తో పాటు ఇద్దరు విలన్లు ఉదయ్, అనీల్ దూకారు. అయితే హీరో విజయ్ బయటకు వచ్చేశారు. విలన్లు ఉదయ్, అనీల్ ఇద్దరు జలసమాధి అయ్యారు. బెంగళూరు నగర శివార్లలోని తిప్పగుండన హళ్ళి చెరువులో ఈ విషాదం చోటుచేసుకుంది.
మాస్తిగుడి (కన్నడ సినిమా) క్లైమాక్స్ షూటింగ్ బెంగళూరు నగర శివార్లలోని తిప్పగుండనహళ్ళి (రామనగర జిల్లా) చెరువు దగ్గర గత రెండు రోజుల నుంచి ఏకదాటిగా జరుగుతోంది. సోమవారం హెలికాప్టర్ లో హీరో, విలన్లు పై పోరాట దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.
ఉదయం నుంచి షూటింగ్ జరుగుతోంది. మద్యాహ్నం సుమారు 100 అడుగుల ఎత్తులో హెలికాప్టర్ నుంచి ముందుగా విలన్లు, తరువాత హీరో చెరువులో దూకే సన్ని వేశం చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో చెరువులోకి దూకిన ఇద్దరు విలన్లు ఉదయ్, అనీల్ జలసమాధి అయ్యారని తావరకెరె పోలీసు అధికారులు చెప్పారు.
10 మంది గజఈతగాళ్లతో ఉదయ్, అనీల్ మృతదేహాల కోసం గాలిస్తున్నారు. కలుషిత నీరు ఎక్కువగా ఉండటంతో గజ ఈతగాళ్లు సైతం ఇద్దరి మృతదేహాల కోసం గాలించడానికి నానా తంటాలు పడుతున్నారు.
తిప్పగుండనహళ్ళి చెరువులో ఆసిడ్ నీరు కలుషితం కావడంతో చెడువాసన వస్తుంది. ఇక్కడ పశువులు సైతం నీళ్లు తాగవని స్థానికులు అంటున్నారు. అందు వలన హెలికాప్టర్ నుంచి చెరువులో దూకిన ఇద్దరు విలన్లు ఉదయ్, అనీల్ బయటకురాలేకపోయి జలసమాధి అయ్యారని పోలీసు అధికారులు అంటున్నారు.