మహిళా కానిస్టేబుల్పై 3రోజులు రేప్ -డీఐజీ, సీఐ అకృత్యం -ఎట్టకేలకు సస్పెండ్ చేసిన సీఆర్పీఎఫ్
ఆటల్లో రాణించిన ఆమె స్పోర్ట్స్ కోటాలో సీఆర్పీఎఫ్లో కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించింది. ఆ దళం తరుఫునా ఎన్నెన్నో టోర్నమెంట్లలో పాల్గొని మెడల్స్ కూడా సాధించింది. తదుపరి ఈవెంట్లకు వెళ్లేముందు ప్రాక్టీస్ కోసం సీఆర్పీఎఫ్ స్పోర్ట్స్ కాప్లెక్స్ లో చేరగా, అక్కడ కోచ్ గా వ్యవహరిస్తోన్న సీఐ, స్పోర్ట్స్ విభాగానికి డీఐజీగా వ్యవహరించిన అధికారి ఆమెపై కన్నేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆమెను ఓ చోటికి రప్పించి, ఇద్దరూ కలిసి మూడు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతర్గత దర్యాప్తుతో ఆ ఇద్దరూ దోషులని తేలడంతో సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళితే..
జగన్ సర్కార్ మరో భూదందా -ఇళ్ల పట్టాల అసలు కథ -నిమ్మగడ్డకు హ్యాట్సాఫ్: వైసీపీ ఎంపీ రఘురామ
ఆ కీచకుడు అర్జున అవార్డీ కూడా
మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆమెను లైంగికంగా హింసిచిన ఘటనలో డీఐజీ ఖాజన్ సింగ్, సీఐ సుర్జిత్ సింగ్ లను సస్పెండ్ చేస్తున్నట్లు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు బుధవారం ఒక ప్రకటన చేశారు. కానిస్టేబుల్ ను రేప్ చేసిన డీఐజీ గతంలో రెజ్లింగ్ ఛాంపియన్. ఆసియా గేమ్స్ లో సిల్వర్ మెడలిస్టు. జాతీయ స్థాయి పోటీల్లో చాలా మెడల్స్ గెల్చుకున్నాడు. క్రీడారంగానికి చేసిన విషిష్టసేవలను గుర్తించి కేంద్రం ఆయనకు అర్జున అవార్డును కూడా ప్రదానం చేసింది. అయితే వాస్తవంలో మాత్రం అతనెంత దుర్మార్గుడో మహిళా కానిస్టేబుల్ ఉదంతంలో బయటపడింది.
కోచింగ్ పేరుతో తాకుతూ.. ఆపై..
సీఆర్పీఎఫ్ డీఐజీ, సీఐలు కలిసి తనపై రేప్ చేశారంటూ 2014లో జరిగిన సంఘటనపై బాధిత మహిళా కానిస్టేబుల్ దాఖలు చేసిన ఫిర్యాదులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ''2012లో నేను స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో చేరాను. ప్రాక్టీస్ కోసం వచ్చే మహిళా ఉద్యోగులు అందరి పట్లా వాళ్ల తీరు ఇలానే ఉండేది. కోచ్ గా వ్యవహరించే సుర్జీత్ సింగ్ శిక్షణ పేరుతో అమ్మాయిల్ని అసభ్యంగా తాకేవాడు. ఎంచుకున్న వాళ్లకు ఫోన్లు చేసి, బూతు మెసేజ్ లు పంపేవాడు. మరిన్ని అవకాశాలు కావాలంటే డీఐడీ ఖాజన్ సింగ్ సార్ ను కలవాలని ప్రోత్సహించేవాడు. రోజుల వ్యవధిలోనే డీఐజీ సార్ నేరుగా రంగంలోకి దిగేవాడు..
గదిలో బంధించి మూడు రోజులు..
డీఐజీ స్థాయి అధికారి తన పవర్ ఉపయోగించి మహిళా క్రీడాకారిణులకు వేర్వేరు పనులు అప్పగించేవాడు. 2014 అక్టోబర్ 31నాడు డ్యూటీలో భాగంగానే నన్ను.. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ఏరియాలో గల ఓ ఫ్లాట్ కు రమ్మన్నారు. తీరా వెళ్లిన తర్వాత గదిలో బంధించి బలవంతానికి పాల్పడ్డారు. ముందుగా ఇద్దరూ కలిసి నాపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత విడివిడిగా అకృత్యానికి పాల్పడ్డారు. అలా మూడు రోజుల పాటు నాపై పలు మార్లు అఘాయిత్యం జరిపి, నవంబర్ 2న వదిలేశారు'' అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఉదంతంపై సీనియర్ ఐపీఎస్ అధికారిణి చారు సిన్హా అంతర్గతంగా దర్యాప్తు చేశారు. మహిళా కానిస్టేబుల్ ఆరోపణలు నిజమేనని, డీఐజీ, సీఐలు సెక్స్ స్కాండల్ కు పాల్పడ్డది వాస్తవమేనని నిర్ధారిస్తూ రిపోర్టు ఇవ్వడంతో ఆ ఇద్దరినీ సీఆర్పీఎఫ్ తొలగించింది. దీనిపై కోర్టులో విచారణ కొనసాగనుంది.